mt_logo

అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను తొలగించడం తెలంగాణ చరిత్రను చెరిపేయడమే: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి గారు.. ఇదేం రెండునాల్కల వైఖరి. ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన. మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం.. చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని దుయ్యబట్టారు.

అవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు. జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా.. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప.. గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. చార్మినార్ అని అధికారిక గీతంలో కీర్తించి.. అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అని ప్రశ్నించారు.

చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు.. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్‌కు ఐకాన్. కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు.. సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే అని తేల్చి చెప్పారు.

మీ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి. మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి. భారత జాతీయ చిహ్నంలోనూ అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి. జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది. వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి అని విమర్శించారు.

కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా.. ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా.. ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు.. రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా అని కేటీఆర్ అడిగారు.

గత పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై.. యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించం పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా… మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం అని హెచ్చరించారు.