mt_logo

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు బ్రేకులు పడటం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం: కేటీఆర్

పక్క రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకెంత కాలం ఈ సందిగ్ధం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. విద్యార్థులను ఆగం చేసి.. ఇంకెంత కాలం దీన్ని సాగదీస్తారు? అని అడిగారు.

తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్‌గా మార్చి, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీఓ 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కార్ ఎందుకింత మొండిపట్టు పడుతోంది. స్థానికతను నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేస్తోంది. రోజురోజుకూ ఇంకా ఎందుకు న్యాయపరమైన చిక్కుల్లోకి నెడుతోంది? అని ప్రశ్నించారు.

తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలు కంటున్న వేలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఇకనైనా వెనక్కి తీసుకోవాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సమైక్య రాష్ట్రంలో కేవలం ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే.. స్వరాష్ట్రంలో 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుని వాటి సంఖ్యను 34కు పెంచుకున్నది ఇందుకేనా? జిల్లాకో మెడికల్ కాలేజీ నినాదాన్ని బీఆర్ఎస్ హయాంలో నిజం చేస్తే.. కాంగ్రెస్ సర్కారు రాగానే దారుణంగా నీరుగారుస్తోంది అని దుయ్యబట్టారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లను ఏకంగా 8915కు పెంచుకుని రాష్ట్రాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే, ఆ సమున్నత లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తోంది. నాటి కేసిఆర్ గారి విజన్‌కు.. నేటి కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో గ్రహణం పట్టింది అని విమర్శించారు.