mt_logo

కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ.. ఇరు పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించింది: కేటీఆర్

సిరిసిల్లలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల కాంగ్రెస్‌తో మేము పోటీ పడ్డాం. మొత్తం 17 స్థానాల్లో మేమే ధీటుగా పోటీ ఇచ్చాం.  ఒక్క సీటు కూడా రాదు అనే పరిస్థితి నుంచి ఇవ్వాళ కాంగ్రెస్, బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది మా గులాబీ దండు అని పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మూడు పార్టీల్లో బీఆర్ఎస్సే ఎక్కువ సీట్లు గెలవబోతోంది. దేశంలో ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి మెజార్టీ రాదు. ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయి అని తెలిపారు.

ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ.. ఇది రెండు జాతీయ పార్టీల పరిస్థితి. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి లాంటి 6-7 ప్రాంతాల్లో కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది.. బీజేపీని గెలిపిచేందుకు కిషన్ రెడ్డి కన్నా కూడా రేవంత్ రెడ్డే ఎక్కువ కష్టపడ్డాడు అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ గారి బస్సుయాత్ర మొత్తం లోక్‌సభ ఎన్నికల చిత్రాన్ని మార్చేసింది.  దీంతో కాంగ్రెస్, బీజేపీలు దిగిరావాల్సిన పరిస్థితి వచ్చింది. 17 రోజుల బస్సుయాత్ర కాంగ్రెస్, బీజేపీలను గింగిరాలు తిప్పింది.. కేసీఆర్ గారు ఎక్కడెక్కడికి వెళ్లారో అక్కడ  ప్రజలు బ్రహ్మరథం పట్టారు అని కేటీఆర్ అన్నారు.

ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పార్టీ నాయకులందరి గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనబడుతోంది.. రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం. కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాలను రద్దు చేయాలని.. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయాలని చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను చూపించాయి. ఆరు గ్యారంటీలు వందరోజుల్లో చేస్తామని చెప్పి  మోసం చేసిన కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. బోనస్, కరెంట్, రైతుబంధు విషయంలో చేసిన మోసంతో రైతులు భగ్గున మండుతున్నారు అని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత ఓట్ల రూపంలో కనబడే అవకాశం కనిపిస్తోంది. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు వేసినప్పటికీ నమ్మలేని పరిస్థితి వచ్చింది. కోటి 67 లక్షల మంది మహిళలకు వందరోజుల్లో రూ. 2,500 ఇస్తా అని ఇవ్వకపోవటంతో మహిళలు కోపంగా ఉన్నారు. మహిళలకు 100 రోజుల్లోనే రూ. 2,500, స్కూటీలు, తులం బంగారం ఇవ్వలేదు. చివరకు మంచినీళ్ల విషయంలో కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి తేవటం మహిళల్లో ఆగ్రహానికి కారణమైంది.. పెద్ద మనుషులు కూడా రూ. 4 వేలు అని ఆశపడితే జనవరి నెల 2 వేలు ఎగ్గొట్టిండు అని దుయ్యబట్టారు.

కొత్తగా ఏ వర్గం కూడా కాంగ్రెస్ జత కాలేదు. అన్ని వర్గాలు కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉన్నాయి. బీజేపీ మీద కూడా ప్రజల్లో సానుకూలత లేదు.  నలుగురు ఎంపీలు ఉండి కూడా పదేళ్లు రాష్ట్రానికి ఏం చేయలేదన్న కోపం ప్రజల్లో ఉంది.  పెట్రోల్, డిజీల్, నిత్యావసరాలు, సిలిండర్ ధరల పెంపు కారణంగా ప్రజల్లో మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని పేర్కొన్నారు.

మేము అన్ని వర్గాలకు సామాజిక న్యాయాన్ని పాటించాం. 12 జనరల్ స్థానాల్లో 50 శాతం బీసీలకే ఇచ్చాం.  ప్రజలతో మంచి సంబంధాలు.. పోరాడే తత్వం ఉన్న వాళ్లకు మేము సీట్లు ఇచ్చాం.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం పారాచ్యూట్ లీడర్లకు సీట్లు ఇచ్చారు.. దీంతో వాళ్ల పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది.. మా అభ్యర్థుల పట్ల సానుకూలత.. వాళ్ల అభ్యర్థులను పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది అని కేటీఆర్ అన్నారు.

గత ఐదు నెలల పాటు కాంగ్రెస్ టైమ్‌పాస్ చేసింది. కాళేశ్వరం, శ్వేతపత్రం, ఫోన్ ట్యాపింగ్ పేరుతో సమయం వృథా చేశారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌పై అసాధారణ వ్యతిరేకత వచ్చింది.. వారిపై ప్రజల్లో కోపం ఉంది. ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోతే వారికి దారుణమైన పరాభవం తప్పదు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని ప్రజలు భావించారు.  కాంగ్రెస్, బీజేపీలు సన్నాయి నొక్కులు నొక్కుతూ, కేసీఆర్‌ను తిట్టేందుకే ఉన్నాయని ప్రజలు గ్రహించారు అని అభిప్రాయపడ్డారు.

పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఊహించని విధంగా ఐదు నెలల క్రితం ఓటమి పాలైనప్పటికీ తిరిగి ఎంతో కష్టపడి పనిచేసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కొంతమంది స్వార్థపరులు పార్టీని వీడినప్పుటికీ ఎంతో కష్టపడ్డ  పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు అని అన్నారు.

ప్రత్యర్థులు చేసిన దుష్రచారాన్ని తిప్పికొడుతూ సోషల్ మీడియా లోనూ అద్భుతంగా  పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్‌కు ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెడతానని బెదిరించినప్పటికీ భయపడకుండా పార్టీ విధానాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లారు అని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల నుంచి వచ్చిన ఆదరణతో పార్టీ పదికాలాల పాటు ఉంటుందన్న ఉత్సాహం జోష్ వచ్చింది. పార్టీ కార్యకర్తలు చేసిన కష్టం ద్వారా మంచి ఫలితాలు రానున్నాయి. ఈ శ్రమ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలకు బలమైన పునాది కానుంది. ఎన్నికల్లో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని కేటీఆర్ అన్నారు.