mt_logo

దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్‌పై శాసనసభలో చర్చ పెట్టు: రేవంత్‌కు కేటీఆర్ లేఖ

దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.

ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తున్నది. విషయం మీద ఈ వారం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది అని తెలిపారు.

2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అని దుయ్యబట్టారు.

ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు  రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది అని వ్యాఖ్యానించారు.

కనుక శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి అని అన్నారు.