mt_logo

గులాబీ జెండా పార్లమెంట్‌లో ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష: ఆదిలాబాద్‌లో కేటీఆర్

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 4 నెలల క్రితమే కేసీఆర్ గారు అభ్యర్థిని ప్రకటించారు. ఆత్రం సక్కు గారికి ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గారు ఆయనను ఆదిలాబాద్ అభ్యర్థిగా ప్రకటించారు అని తెలిపారు.

అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుకున్నా సరే.. ఆత్రం సక్కు మాత్రం ఏ ప్రలోభాలకు లొంగలేదు. మంత్రి పదవులు, పెద్ద పదవులు చేసిన వారు అధికారం పోగానే పార్టీ నుంచి జారుకున్నారు. కానీ ఆత్రం సక్కు గారు మాత్రం విలువతో కూడిన వ్యక్తి..పార్టీ కష్టకాలంలో కూడా పార్టీతోనే ఉన్న నిజాయితీ గల వ్యక్తి అని కొనియాడారు.

అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రుణమాఫీ, రైతు భరోసా, ఇంట్ల ఇద్దరు ముసళోళ్లు ఉండే ఇద్దరికి రూ. 4 వేలు ఇస్తా అంటూ డైలాగులు కొట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్న మాటను గుర్తు చేసుకోవాలె..డిసెంబర్ 9 నాటి ప్రమాణం స్వీకారాన్ని డిసెంబర్ 7 కే చేసిండు. అధికారమేమో రెండు రోజుల ముందే.. రుణమాఫీ మాత్రం 4 నెలలైనా చేయలే. ఇప్పుడు ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తా అని కొత్త పాట ఎత్తుకున్నాడు. రైతులు కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో కొత్త వాయిదా పెట్టిండు అని విమర్శించారు.

రుణమాఫీ కావాలన్న, రూ. 2500 కావాలన్న, ముసలోళ్లకు రూ. 4 వేలు కావాలన్నా బీఆర్ఎస్ గెలవాల్సిందే. లేదంటే రేవంత్ రెడ్డి ఉన్న అన్ని పథకాలను ఇచ్చ కొట్టుడు ఖాయం. లంకె బిందెలు ఉంటాయని అనుకొని వచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి.. లంకె బిందెల కోసం తిరిగేటోళ్లు పచ్చి దొంగలు అంటారు అని ఎద్దేవా చేశారు.

రైతు బంధు ఏమైందయ్యా అంటే ఓ మంత్రి చెప్పుతోని కొడుతా అంటాడు. కేసీఆర్ 70 లక్షల మంది రైతుల ఖాతాలో రూ. 70 వేల కోట్లు రూపాయాలు జమ చేసిండు. రైతులు ఇప్పుడు చెప్పుతో కొట్టినట్లు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరముంది. కేసీఆర్ ఉన్నప్పుడు కడుపు నిండా నీళ్లు, 15 రోజుల్లో పండ కొనుగోళ్లు ఉంటుండె. కాంగ్రెస్ వచ్చింది.. కరువును తీసుకొచ్చింది.. ఇవ్వాళ గ్రామాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది అని అన్నారు.

గతంలో విష రోగాలు, అతిసారా అనే వ్యాధులు ఉండే. మిషన్ భగీరథ కార్యక్రమంతో కేసీఆర్ వాటిని లేకుండా చేశారు. మళ్లీ పాత రోజులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి నిజాయితీ చెప్పి మరి మోసం చేసిండు.. తప్పు రేవంత్ రెడ్డి కాదు.. మనదే. మనం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోవటంలో విఫలమయ్యం అని కేటీఆర్ పేర్కొన్నారు.

లక్షా 63 వేల ఉద్యోగాలను మనం విద్యార్థులకు చెప్పుకోలేపోయాం.. మన మీద జరిగిన విష ప్రచారాన్ని సరిగా తిప్పికొట్టలేకపోయాం. ఇవి మన అందరి భవిష్యత్, పార్టీ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలు. కాంగ్రెస్, బీజేపీ మీద ప్రజలు మంట మీద ఉన్నారు.. మరి కష్టపడి పనిచేస్తే ఆదిలాబాద్ గెలవటం పక్కా అని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ చేసిన, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించటమే మన పని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందా? మరి నోటిఫికేషన్ ఇవ్వకుండా మన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. మంది పిల్లలను మా పిల్లలు అని చెప్పుకునే రకం కాంగ్రెస్ పార్టీ.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ హామీని యువతకు మనం చెప్పాలె అని కోరారు.

టెట్ పరీక్ష కోసం మనం 400 ఫీజు పెట్టాం.. మేము వస్తే ఫ్రీ గా ఎగ్జామ్ పెడతామన్నారు.. కానీ టెట్ పరీక్ష కోసం రూ. 2000 ఫీజు పెట్టారు. మన డీఎస్సీలో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఇది దగా అన్నాడు రేవంత్ రెడ్డి. 25 వేల ఉద్యోగాల ఖాళీ ఉన్నాయని అన్న రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు 10 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిండు. టెట్, డీఎస్సీ, గ్రూప్స్ అన్ని విషయాల్లో విద్యార్థులను పచ్చిమోసం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మాటలేమో ఆకాశంలో చేతలేమో పాతాళంలో అని దుయ్యబట్టారు.

దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఉద్యోగులతో పేగు బంధమని చెప్పి అత్యధిక జీతాలు ఇచ్చాం.. కానీ జీతాలు ఆలస్యమయ్యాయని వాళ్లు దూరమయ్యారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైన కారణంగా కాస్త జీతాలు ఆలస్యమయ్యాయి. ఐతే వాళ్లందరికి మనం సరిగా తీరుగా మనం చేసిన పనులను చెప్పుకోలేకపోయాం అని కేటీఆర్ అన్నారు.

గిరిజనుల కోసం కేసీఆర్ గారు తాండాలను పంచాయితీలు చేశారు.. 6 శాతం రిజర్వేషన్లు ఇచ్చికున్నాం, సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాం. పోడు భూములను పంచినాం. కొమురం భీమ్ గారి ఆశయాలను అనుగుణంగా పనిచేసింది కేసీఆర్. ఇంద్రవెల్లిలో గిరిజనులను కాల్చి చంపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సిగ్గు లేకుండా, మానం లేకుండా మళ్లీ ఇంద్రవెల్లికి వచ్చి గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి. కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది పార్టీ వదిలి వెళ్లే నాయకులు ఉన్నప్పటికి..కార్యకర్తలు మాత్రం బలంగా ఉన్నారు. కార్యకర్తల కోసం మేమంతా ఖచ్చితంగా పనిచేస్తాం. ఆదిలాబాద్‌లో మనం ఓడిపోయిన చోట ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవాలె.. పూర్వ వైభవం తెచ్చుకోవాలె అని పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు ఈయన ముఖ్యమంత్రా అని అనుకుంటున్నారు.. ఓ చిల్లర వ్యక్తి మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడు.. మానవ బాంబు అవుతా అంటాడు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు పదవిలో ఉండి 420 హామీలను అమలు చేయాలనే మేము కోరుకుంటాం. కాంగ్రెస్ అనే సర్పాన్ని చలిచీమల మాదిరిగా పట్టి ఖతం పట్టించాల్సిన బాధ్యత మన అందరిది అని అన్నారు.

మైనార్టీ సోదరులు ఒక్కసారి ఆలోచించాలె.. రేవంత్ రెడ్డి అసలు రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా? మోడీ కోసమా? చౌకిదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటే.. రేవంత్ రెడ్డి ఏమో మోడీ మేరా బడే భాయ్ అంటాడు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ అంటే.. రేవంత్ రెడ్డి మాత్రం అదానీ నా ఫ్రెండ్ అంటాడు. గుజరాత్ మోడల్ గోల్ మాల్ అని రాహుల్ గాంధీ అంటే.. గుజరాత్ మోడల్‌ను తెలంగాణలో చేస్తామని రేవంత్ రెడ్డి అంటాడు.. లిక్కర్ స్కామ్ లేదు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయటం అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు.. రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడు..పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలా మార్పులు జరుగుతాయి. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అవుతాడు అని కేటీఆర్ తేల్చి చెప్పారు.

ఓ ఇంటర్వ్యూలో మోడీకి ఓటేస్తా అని ఓ పిల్లాడు అంటే మోడీకి ఓటు వేసుకోండి అంటాడు..అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషా? బీజేపీ మనిషా?  కాంగ్రెస్ ఫాల్తు గాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషా? బీజేపీ మనిషా? చెప్పాలె అని సవాల్ విసిరారు.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఖచ్చితంగా అది బీజేపీకి వెళ్తుంది.. మైనార్టీలు జాగ్రత్త. బీజేపీకి మేము బీ టీమ్ అంటారు కొంతమంది బేవకూఫ్ గాళ్లు.. బీజేపీ పెద్ద నాయకులందరినీ ఓడించింది బీఆర్ఎస్ కాదా.. అలాంటిది మేము వాళ్లకు బీ టీమ్ ఎలా అవుతామో చెప్పాలిరా సన్నాసులు..రాజ్యాంగం మారుస్తాం. రిజర్వేషన్లు తీసేస్తామని బాజాప్తా బీజేపోళ్లు చెప్పుతున్నారు అని అన్నారు.

ఇప్పుడు బీజేపీ బేచో ఇండియా అనే కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ తెగనమ్ముతోంది బీజేపీ ప్రభుత్వం. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకుండా చేసే పని పెట్టుకుంది బీజేపీ అని తెలిపారు.

బీజేపీకి ఎందుకు ఓటు వేయాలె.. ఆదిలాబాద్‌ను ఆగం చేసినందుకా? మతం పేరుతో దేశంలో విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నందుకా? మోడీ దేవుడని బండి సంజయ్ అంటాడు. ఎందుకు దేవుడు. ధరలు పెంచినందుకా? పెట్రోల్, డిజీల్ ధరలు పెంచినందుకా? ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనందుకా? ఐటీఐఆర్ ఇవ్వనందుకా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకా? దేనికి మోడీ దేవుడు? అని ప్రశ్నించారు.

రాముడితో మనకు పంచాయితీ లేదు. తెలంగాణకు పైసా పనిచేయని బీజేపీని పండవెట్టి తొక్కుద్దాం. 2026 లో డిలిమిటేషన్ జరగబోతోంది. జనాభా అధారంగా లోక్ సభ సీట్లను కేటాయిస్తారంటా. అంటే జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సక్సెస్ ఫుల్‌గా చేశాయి. దేశానికి మంచి జరిగేలా జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని తెలిపారు

పార్లమెంట్‌లో ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు ఉండాలని కొంతమంది అడుగుతున్నారు. రేపటి రోజున పార్లమెంట్‌లో తెలంగాణ లోక్ సభ సీట్లు తగ్గకుండా మాట్లాడాలంటే బీఆర్ఎస్ ఉండాలి. కాంగ్రెస్, బీజేపీ సన్నాసులు డూ డూ బసవన్నలు. వాళ్లతో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం చేతకాదు అని దుయ్యబట్టారు.

గులాబీ జెండా పార్లమెంట్‌లో ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష.. కాంగ్రెస్, బీజేపోళ్లు ఓటు అడగటానికి వస్తే.. వాళ్లను నిలదీయండి. ఇచ్చిన హామీలను అమలు చేయాలని గల్లా పట్టి అడగండి అని కేటీఆర్ కోరారు.