సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ సంస్మరణ సభ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఐటీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహా పలువురు తెలంగాణ జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల ఆర్ధికసాయం అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, హరిప్రసాద్ ఇద్దరు కుమారులను చదివించే బాధ్యత తమదేనని, ప్రభుత్వం తరపున వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఉద్యమంలో తామందరినీ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన ఘనత జర్నలిస్టులదేనని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల రుణం తప్పకుండా తీర్చుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్టులు 10 నుండి 12 వేల మంది దాకా ఉన్నారని, సరైన ప్రతిపాదనలు, సమాచారంతో వస్తే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ చెప్పారు.