mt_logo

మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే రేవంత్ ఢిల్లీ పర్యటన: కేటీఆర్

మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన భాసులతో మంతనాలు చేస్తున్నారని అరోపించారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగురిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం పది నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ది చేకూర్చారో చెప్పాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలలో కాలంలోనే ఢిల్లీకి 23 సార్లు చక్కర్లు కొట్టారు. ఇందులో ప్రజల ప్రయోజనం ఏముందో, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటనల కారణంగా రాష్ట్రానికి వచ్చిన నిధులెన్నో లెక్కలు ప్రకటించాలని కేటీఆర్ కోరారు.

కనీసం రేవంత్ పెట్టిన ఫ్లైట్ ఛార్జీల ఖర్చంతా నిధులైనా ఈ రాష్ట్రానికి తీసుకు వచ్చారా అని ఎద్దేవా చేశారు. అత్యధిక సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు

ఢిల్లీ పర్యటనలు ప్రజల కోసమా లేదంటే మీ అధిష్టానాన్ని మెప్పించటానికి ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూసీలో కొల్లగొట్టే వేల కోట్ల రూపాయల లెక్క చెప్పేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారన్నారు. పేదల గూడు కూల్చేందుకు రాహుల్ గాంధీతో, అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారన్నారు.రాష్ట్ర పాలన గాలికి వదిలి గాలిమోటార్ ఎక్కుతున్న రేవంత్ తీరుపైన కెటిఅర్ మండిపడ్డారు.

ప్రజల అవసరాలను పక్కన పెట్టి చిటికి మాటికి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండటం చూస్తుంటే ప్రజలకు మంచి చేయటం కన్నా ఢిల్లీ బాసులకు జై కొడితే తన సీటుకు ఎలాంటి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లున్నాడన్నారు. రేవంత్ రెడ్డి పది నెలల పాలనలో తెలంగాణలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు.

అటు ఢిల్లీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పాలనపై సంతోషంగా లేనందునే పదే పదే పిలుస్తూ ఆయనకు చీవాట్లు పెడుతున్నట్లుందన్నారు. కేవలం పది నెలల కాలంలోనే ఇన్ని సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లారంటే ఇదే లెక్కలో  ఏదైళ్లలో మరో 125 సార్లు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోందన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఢిల్లీకి గులాంగిరి చేసేందుకు కాదు…పేదలకు మంచి చేసేందుకన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీకి గులాంగురి తప్పదని తాము ఎన్నికలకు ముందే చెప్పామని.. ఇప్పుడు అదే జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ బాసులకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ముఖ్యమంత్రి జీ హుజురు అంటూ హస్తినాకు వెళ్తున్నారన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టటమేనంటూ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యనించారు.

మొదట్లో సీఎం ఢిల్లీ పర్యటనల పై విమర్శలు రావటంతో చాలా తెలివిగా కేంద్రం పెద్దలను కలిసి రాష్ట్రానికి నిధులు తెస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఎంత మంది కేంద్రం పెద్దలను కలిసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు తెచ్చారో కచ్చితంగా చెప్పాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు వెళ్లినప్పటికీ కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు తెస్తామంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు.

మోడీని బడే భాయ్ అన్న మీరు మీ బడే భాయ్ ని ఒప్పించి ఎన్ని వేల కోట్లు తెచ్చారో రాష్ట్ర ప్రజల ముందుంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో, మొన్నటి వరద సాయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

కేవలం ఢిల్లీలో అధిష్టానాన్ని కలిసేందుకు రాష్ట్రానికి నిధులు తెస్తామంటూ మీరు వేసుకున్న ముసుగు ప్రజలకు తెలుసని కేటీఆర్ అన్నారు. పదే పదే పాలనను గాలికి వదిలి ఢిల్లీకి వెళ్తున్న అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు.

ఇకనైనా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలను పక్కన పెట్టి ప్రజలకు మంచి చేసే పనిలో నిమగ్నం కావాలని సూచించారు. ఇకనైనా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టడం మాని ఓట్లేసి గెలిపించిన ప్రజలకిచ్చిన హమీల అమలుపైన దృష్టిసారించాలని కేటీఆర్ ముఖ్యమంత్రికి హితవు పలికారు.