mt_logo

హైదరాబాద్‌ను స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దాం: ఇస్బాకాన్ సదస్సులో కేటీఆర్

హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే మూడు సుత్రాలతో నగరంలో స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను నిర్మించామన్నారు.

తార్నాకలోని సీసీఎంబీలో జరిగిన ఇస్బాకాన్ (ISBACON-2024) సదస్సుకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే యంగెస్ట్ రాష్ట్రమైన తెలంగాణలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కల్పించాలంటే స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించటమే సరైన మార్గమని తాను భావించానని అన్నారు.

యంగ్ టాలెంట్‌కు సరైన ఆర్థిక వనరులను కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్న నమ్మకంతో టీ+హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. తన మానస పుత్రిక అయిన టీ-హబ్ గ్రోత్ స్టోరీని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. టీ హబ్, టీ వర్క్స్, ఇమేజ్ టవర్స్ పేరుతో దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ హైదరాబాద్‌లో తీర్చిదిద్దామన్నారు.

2,000 స్టార్టప్ కంపెనీల కెపాసిటీతో ప్రారంభమైన టీ హబ్ సక్సెస్ కావటంతో ఆ తర్వాత టీ వర్క్స్ , ఇమేజ్ టవర్స్ పేరుతో ఒకే చోట 5 వేల స్టార్టప్ కంపెనీలకు గైడెన్స్ చేసే విధంగా తీర్చిదిద్దామన్నారు. 2014 లో హైదరాబాద్‌లో 200 స్టార్టప్ కంపెనీలుంటే ప్రసుత్తం 5 వేలకు పైగా స్టార్టప్ కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు.

రతన్ టాటా లాంటి గొప్ప వ్యక్తి టీ-హబ్‌ను ఆధునిక భారత ముఖచిత్రం అంటూ ప్రశంసించటాన్ని ఎంతో గర్వంగా భావించానని కేటీఆర్ అన్నారు. గొప్ప వ్యాపార ఆలోచనలున్న యువత, మహిళలు, గ్రామీణ యువతలోని వ్యాపార ఆలోచనలకు కార్యరూపం దాల్చే విధంగా టీ హబ్, టీ వర్క్స్, ఇమేజ్ టవర్స్, టాస్క్, వీ హబ్ వంటి వాటిని ఏర్పాటు చేశామన్నారు.

భారత్ స్వదేశీ టెక్నాలజీతో ప్రయోగించిన మొదటి శాటిలైట్ ప్రయోగం లో హైదరాబాద్‌లోని స్టార్టప్ కంపెనీయే కీలక పాత్ర పోషించిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న మొత్తం స్టార్టప్ కంపెనీలు ఏటా 3.5 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధిస్తున్నాయని చెప్పారు.

టీ హబ్, టీ వర్క్స్, ఇమేజ్ టవర్స్ పేరుతో ప్రారంభించిన ఇంక్యుబేటర్ పెద్ద ఎత్తున విజయవంతం కావటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఎంతో మంది ఔత్సహిక పారిశ్రామిక వేత్తల ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు కృషి చేశామన్నారు. టైర్-2, టైర్-3 నగరాలకు కూడా ఈ ఎకో సిస్టమ్ విస్తరించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.