Mission Telangana

బ్యాంకర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు ఉదయం సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. సమావేశంలో రైతుల రుణమాఫీపై చర్చించనున్నారు. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. మొత్తం 25 వేల కోట్ల రుణాలు ఉంటాయని, అందులో కేవలం పంట రుణాలే 18వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. బ్యాంకుల్లో రైతుల రుణాల వివరాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. లక్ష లోపు రుణమాఫీకి సహకరించాలని బ్యాంకర్లను కేసీఆర్ కోరారు.

అనంతరం ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉందని, పంట రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని బ్యాంకర్లను కోరినట్లు తెలిపారు. పూర్తి వివరాలు సోమవారం లోపు వస్తాయని, 2013-14 సంవత్సరంలో తీసుకున్న పంటరుణాల్లో లక్ష రూపాయల వరకే రుణమాఫీ వర్తిస్తుందని, బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కు, రుణమాఫీకి సంబంధం లేదని, కొత్త రుణాలు అందించడానికి బ్యాంకర్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *