తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. సమావేశానంతరం మంత్రి కేటీఆర్ వివరాలు వెల్లడించారు. జనాల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఇన్నర్ వేర్ బ్రాండ్ జాకీ(పేజ్ ఇండస్ట్రీస్) ఇబ్రహీంపట్నం, ములుగులో గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతుందని తెలిపారు. ఒక కోటి జాకీ గార్మెంట్స్ ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. దీంతో 7 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా జాకీ కంపెనీని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేటీఆర్ తన సొషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.
