ప్రభుత్వ స్కూళ్ళు, హాస్టళ్ళకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, వచ్చేనెల నుండి దీనిని అమలు చేస్తామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో బుధవారం నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన ర్యాలీని ఈటెల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమసమయంలో ప్రజల మధ్య ఉంటూ హాస్టళ్ళలో బసచేసిన తమకు అక్కడి పరిస్థితులు తెలుసని, విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఆసరా పథకంలో వికలాంగులకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ అందజేస్తామని, రాష్ట్ర సాధనలో వికలాంగుల పాత్ర కీలకమైనదని, అందరి భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ సాధిస్తామని మంత్రి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు వికలాంగుల పించన్ మొత్తాన్ని రూ. 1500 కు పెంచామని, అన్ని రకాల పించన్ దారులకు ఈనెల 10 నుండి 15 వ తేదీలోపు పెన్షన్లు అందజేస్తామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం గతంలో ఒక్కొక్కరికి ఇస్తున్న నాలుగు కేజీల రేషన్ బియ్యం స్థానంలో ఒక్కొక్కరికి తమ ప్రభుత్వం ఆరు కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ఈటెల పేర్కొన్నారు.
