బుధవారం కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లాలో రూ.12.30 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన 7 నూతన పోలీస్స్టేషన్ లను హోంమంత్రి మహమూద్ అలీ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అంతకుముందు హరితహారం కార్యక్రమంలో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటారు. కాగజ్ నగర్లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన రూరల్ పోలీస్ స్టేషన్, రూ.30 లక్షల వ్యయం గల సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంతోపాటు, ఒక్కొక్కటి రూ.2.50 కోట్ల వ్యయం గల వాంకిడి, పెంచికల్ పేట్, చింతలవానిపల్లె పోలీస్ స్టేషన్లను వర్చువల్ గా ఆరంభించారు. మరియు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన రెబ్బెన పోలీస్ స్టేషన్ ను కూడా మంత్రు ప్రారంభించారు. స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కమ్ వెయిటింగ్ హాల్, యాంటె రూమ్తో ఎస్హెచ్వొ రూమ్, రైటర్ రూమ్, ఇంటర్వ్యూ గది, కమ్యూనికేషన్ రూమ్, సిసి కెమెరాలను మంత్రులు, డిజిపి పరిశీలించారు.
అనంతరం మంత్రులు మాట్లాడుతూ…. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ప్రజల సౌకర్యార్థం ఖర్చుకు వెనకాడకుండా నూతన భవనాలకు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశనిర్ధేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో వేలాది పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రుల వెంట ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, డీజీపీ మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేష్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిదులు ఉన్నారు.
