mt_logo

రూల్స్ మార్చి పోలీసుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుంది: హరీష్ రావు

రూల్స్ మార్చుతూ పోలీసు సోదరుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నదంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్ కానిస్టేబుల్‌లకు జరుగుతున్న శ్రమదోపిడి గురించి నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా శ్రమ దోపిడి విధానాన్ని అమలు చేస్తున్నారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్ళు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ మార్చడం దుర్మార్గం అని అన్నారు.

వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా మీరు పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక. హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారూ.. టిఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు నెలకొకసారి లీవు విధానం అమలు చేయకుండా, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టిఏ ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించింది. వారి పొట్ట కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న టిఏ, ఎస్ఎల్, జీపీఎఫ్‌లను వెంటనే విడుదల చేయాలి అని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్మెంట్ పెండింగ్ డబ్బులు చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలి. సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం మండల పోలీసు స్టేషన్‌కు రూ. 25,000 పట్టణానికి రూ. 50,000, హైదరాబాద్‌లో అయితే రూ. 75,000 ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నిర్వహణ కోసం నిధులు విడుదల చేయడం లేదు. దానివలన పోలీసులు, పోలీస్ స్టేషన్ వెళ్ళే ప్రజలపై భారం పడుతున్నది. ఈ నిధుల విడుదల కోసం సీఐలు ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే దుస్థితి ఏర్పడింది అని ఆక్షేపించారు.

ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు.