
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ఫూర్తితో పేద విద్యార్థిని చదువుకు ఎన్నారై దూడల వెంకట్ అండగా నిలిచారు. ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ మొదటి ఏడాది ఫీజుకు సంబంధించిన చెక్కును కేటీఆర్ ఆధ్వర్యంలో తన కుటుంబ సభ్యుల ద్వారా అందజేశారు.
వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కొల్లాపూర్ తాలూకా వీపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామానికి చెందిన పేద విద్యార్థిని బి గౌరీకి మెడిసిన్లో సీటు వచ్చింది. ఐతే నిరుపేద కుటుంబం కావటంతో చదువు కోసం ఫీజు చెల్లించలేని స్థితి ఆ కుటుంబ సభ్యులది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కేటీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు.
తక్షణమే స్పందించిన కేటీఆర్ గౌరీ చదువు పూర్తయ్యే వరకు తానే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఐతే కేటీఆర్ స్ఫూర్తితో ఆ పేద విద్యార్థిని చదువుకు తన వంతు సాయం అందిచాలని అమెరికాలో నివసిస్తున్న ఎన్నారై దూడల వెంకట్ ముందుకు వచ్చారు. తన జన్మదినం సందర్భంగా మొదటి సంవత్సరం ఫీజును తాను అందిస్తానని కేటీఆర్కు మాట ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం దూడల వెంకట్ తన కుటుంబ సభ్యుల ద్వారా నందినగర్లో కేటీఆర్ ఆధ్యర్యంలో గౌరి కుటుంబానికి మొదటి సంవత్సరం ఫీజుకు సంబంధించిన రూ. 1,65,000 చెక్ను అందజేశారు. చెక్కును అందించేందుకు వెంకట్ తండ్రి దూడల రవీందర్ తమ సొంతూరు ఆలేరు మండల కేంద్రం నుంచి హైదరాబాద్ లోని నందినగర్ లో కేటీఆర్ నివాసానికి వచ్చారు.
ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ వెంకట్ ను ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా విద్యార్థిని గౌరీతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. గౌరీ కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మెడికల్ సీటు సాధించిన గౌరీని కేటీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. గురుకుల స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశానని గౌరీ చెప్పటంతో కేటీఆర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
వ్యవసాయ కూలీగా పనిచేస్తూ గౌరీని చదివించేందుకు ఆమె తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి కేటీఆర్ ఆశ్చర్యపోయారు. కూతురు చదువుకోసం ఇంతగా కష్టపడుతున్న మీరు ఎంతో మంది ఆదర్శంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా తన చదువుకు అండగా నిలిచిన కేటీఆర్ తో పాటు ఎన్నారై దూడల వెంకట్కు గౌరి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.