mt_logo

అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: హరీష్ రావు

మెదక్‌ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మెదక్‌ను జిల్లా కేంద్రం చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే ఆ కలను నెరవేర్చింది కేసీఆర్ అని పేర్కొన్నారు.

రేవంత్ చెప్పేవన్ని అబద్ధాలే.. మెదక్ రాందాస్ చౌరస్తా మీదుగా నామినేషన్‌కు వెళ్లావే, అక్కడ అభివృద్ధి కనిపించలేదా.. నువ్వు నామినేషన్‌కు వెళ్లిన కలెక్టరేట్ కట్టింది కేసీఆర్ కాదు. నిన్ను మెదక్‌కు రప్పించిన ఘనత కేసీఆర్‌ది.. మెదక్‌కు రైలు తెచ్చింది కేసీఆర్.. వంద కోట్లు ఖర్చు చేసి లైన్ తెచ్చాడు. మూడు జిల్లాలు చేసి, మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాడు అని గుర్తు చేశారు.

చిట్టచివరి ఆయకట్టుకు నీళ్లిచ్చాడు.. ఇంత చేసినా కేసీఆర్ ఏమీ చేయలేదంటున్నావు. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ వందకోట్లు ఇస్తే వాపసు తీసుకున్నావు.. నీకు అమ్మవారి ఉసురు తగులుతుంది.. అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని దుయ్యబట్టారు.

ఉరికిచ్చి కొడ్తా, పేగులు మెడలే వేసుకుంటా, బొందపెడ్తా, మానవ బాంబునవుతా అంటున్నావు.. ఇవేనా సీఎం మాట్లాడాల్సింది? హామీల గురించి అడిగితే హెచ్చరిస్తున్నావు కేసులు పెడుతున్నావు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని వందరోజులు దాటినా చేయనందుకు చెంపలేసుకుని 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పు . మాట తప్పడం, అబద్ధాలు ఆడడం రేవంత్ నైజం అని విమర్శించారు.

మా అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని లోకల్ కాదంటున్నావు, ఆయన ఇక్కడే స్థిరపడిన ఓటర్.. కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజ్‌గిరికి పోయింది నువ్వు. నా ఎత్తుతో రేవంత్‌కు ఏం పని? రైతుల గురించి అలోచించి.. సమస్యలు పరిష్కరించాలి. అహంకారంతో గాల్లో తేలుతున్న కాంగ్రెస్ భూమి మీదకి రావాలంటే వెంకట్రామిరెడ్డిని పార్లమెంటుకు వెళ్లాలి అని హరీష్ అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు 18 రోజులుగా వేచిచూస్తున్నా ప్రభుత్వం కొనడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొన్నాం. కష్టాల పాలైన రైతులను పరామర్శించడానికి నీకు ఒక్క నిమిషం టైమ్ దొరకడం లేదా? మీ పార్టీ నేతలు వీహెచ్, మోత్కుపల్లిలనే నువ్వు కలవడం లేదు.. ఇదేనా ప్రజా పాలన? అని ప్రశ్నించారు.

మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునే బదులు ప్రజల కష్టాలు తీర్చు. కేసీఆర్‌ను తిడుతూ కాలక్షేపం చేయడం కాదు హామీలను నెరవేర్చు.. హామీలు కోసం బాండు రాసిచ్చి బాండ్ల విలువ కూడా తీశావు. మెదక్‌లో గెలిచేది బీఆర్ఎస్సే.. జిల్లా ఇచ్చింది మేం, గోదావరి నీళ్లు తెచ్చింది మేం, లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మేం.. విజ్ఞులైన మెదక్ ఓటర్లు మమ్మల్నే ఆదరిస్తారు అని పేర్కొన్నారు.