mt_logo

రేవంత్ కర్నాటకతో మాట్లాడి 5 టీఎంసీలు జూరాలకి తీసుకురావాలి: హరీష్ రావు

గద్వాలలోని జూరాల ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం కర్నాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దీక్ష విరమింపచేశారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గద్వాల గొంతు తడపడానికి జలదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి, ఇతర నేతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వేసవిలో నీటి కష్టాలు వస్తాయని ప్రజలందరి కోసం ఈ దీక్ష చేపట్టారు.. అన్ని వర్గాల ప్రజలు దీక్షకు వచ్చి మద్దతు పలికారు అని అన్నారు.

కర్నాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. రేవంత్ కర్నాటకతో మాట్లాడి 5 టీఎంసీలు తీసుకురావొచ్చు కదా? పదేళ్ల కేసీఆర్ హయాంలో మంచినీళ్ల కోసం ఒక్క ఎమ్మెల్యే అన్నా దీక్ష చేసిండా? మహిళలు రోడ్లపైకి వచ్చిండ్రా.. కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని విమర్శించారు.

కాంగ్రెస్ మార్పు తేలేదు, పాత పాలనను తీసుకొచ్చింది.. కాంగ్రెస్ హయాంలో కిట్లు బంద్.. తిట్లు మొదలు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశాయి. బీఆర్ఎస్ హయాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం అని పేర్కొన్నారు.

ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ రైతుబంధు వంటి ఎన్నో పథకాలు అమలు చేశారు. కాంగ్రెస్ హామీలపై బాండ్లు రాసిచ్చి మోసం చేసింది.. ఆసరా పింఛన్ రూ. 4 వేలకి పెంచుతామని మోసం చేసింది. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌ను గ్యారంటీగా ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అని తెలిపారు.

నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకుంది బీజేపీ. బీజేపీకి రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే రుణమాఫీ చేయాలి.. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలి ఆని డిమాండ్ చేశారు.

రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారనే బీజేపీ దొంగదీక్షలు చేస్తోంది. కాంగ్రెస్ బీజేపీ దొందూ దొందే.. రేవంత్ కుర్చీ కాపాడుకోవడానికి బీజేపీతో మిలాఖత్ అయ్యాడు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ మెడలు వంచి అమలు చేయించాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలి. నాగర్ కర్నూల్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి అని పిలుపునిచ్చారు.