mt_logo

అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేలకు దిగిరావాలంటే వినోదన్న గెలవాలి: హరీష్ రావు

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా బెజ్జంకిలో జరిగిన రోడ్ షోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వచ్చాక బోర్లలో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, తాగడానికి నీళ్లులేవు. పంటలు ఎండిపోతున్నాయి.. కరెంటు ఉండడం లేదు. వద్దురో కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారు అని పేర్కొన్నారు.

రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కేసీఆర్ హయాంలో వడ్లను గిట్టుబాటు ధరకు కొన్నాం. రూ. 500 బోనస్‌తో రూ. 2500కు కొంటామన్న రేవంత్.. ఇప్పుడు రైతులు రూ. 1800లకే అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నడు? అని ప్రశ్నించారు.

కేసీఆర్ కరోనా సమయంలో సైతం రైతుబంధు ఆపలేదు. రేవంత్ రైతులకిచ్చిన రైతుబంధు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పైగా రూ. 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండు.. అవ్వాతాతలకు రూ. 4 వేల పింఛన్ ఇస్తామని వాళ్లనూ మోసం చేసింది కాంగ్రెస్ అని విమర్శించారు.

మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని రేవంత్ చెప్పిండు..
వాళ్లకు రూ. 10 వేలు బాకీపడిండు. ఓట్ల కోసం కాంగ్రెస్ లీడర్లు వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో రెడీగా ఉన్నారు. ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నాడు.. రెండు నెలల్లో లక్ష లగ్గాలు జరిగాయి.. రేవంత్ లక్ష తులాల బంగారం బాకీ పడ్డడు అని అన్నారు.

మన గుండెలమీద తన్నిన రేవంత్ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో గడ్డపారలై పోటుపొడవాలె. నాలుగు నెలలైనా హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోదామా? అని అడిగారు.

బీజేపీ పదేళ్ల పాలన ప్రజలకు ఒక్క మేలైనా చేసిందా? చెప్పుకోడానికి ఏమీ లేదు కనుక కేలండర్లు, అక్షింతలు పంచుతున్నారు. ధరలు పెంచి గరీబోళ్ల నడ్డి విరిచింది మోదీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.

నేను బెజ్జంకి అభివృద్ధికి రూ. 20 కోట్లు ఇచ్చాను.. రూ. 14 కోట్ల పనులు జరిగాయి. రేవంత్ ప్రభుత్వం నిధులు వెనక్కి తీసుకుంటోంది. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న ప్రజలకు అండగా ఉంటాను ఆని హరీష్ స్పష్టం చేశారు

ప్రశ్నించే గొంతులను గెలిపివ్వండి.. కాంగ్రెస్ మెడలు వంచి హమీలను అమలు చేస్తాం. బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోదన్న ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్‌కు రైలు తెచ్చిండు.. కోట్ల రూపాయల నిధులు తెచ్చిండు. పబ్లిసిటీ చేసేవాళ్లు కావాలా, పనిచేసేవాళ్లు కావాలా? అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేతలు నేలకు దిగిరావాలంటే వినోదన్నను పార్లమెంటుకు పంపాలి అని పీలునిచ్చారు