mt_logo

ఎన్‌హెచ్ఎం ఉద్యోగులకు తక్షణమే మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలి: హరీష్ రావు

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో వైద్యులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, అకౌంటెంట్లు,డేటా ఎంట్రీ ఆపరేటర్లు,సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తదితరులు ఉన్నారు అని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యాలను సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి నెలలుగా జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతున్నది. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఒట్టి డొల్ల అని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అని విమర్శించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 3 నెలల పెండింగ్ జీతంతో పాటు, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఎన్‌హెచ్ఎం ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని హరీష్ డిమాండ్ చేశారు.