mt_logo

కరీంనగర్‌లో బీజేపీ కోసం రేవంత్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టాడు: హరీష్ రావు

కరీంనగర్‌లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోంది. దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు అని పేర్కొన్నారు.

ఎన్నికల హమీల గురించి, నాలుగు నెలల పాలన గురించి మాట్లాడడం లేదు. అయితే తిట్లు లేకపోతే దేవుడిపై ఒట్లు.. ఏ ఊరికిపోతే ఆ ఊరికి పోయి దేవుళ్లపై ఒట్లతో ప్రజలకు మోసం. బాండ్ పేపర్లు నాటకం నడవదని దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడు అని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు.. దొంగే దొంగ అన్నట్టున్నాయి ఆయన మాటలు. బీజేపీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నది రేవంత్.. హుజారాబాద్‌, దుబ్బాక, మునుగోడుల్లో బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలవడానికి పరోక్షంగా సహకరించింది రేవంత్. నాగార్జనసాగర్‌లోనూ ఆ రెండు పార్టీలు సహకరించుకున్నాయి అని విమర్శించారు.

రిజర్వేషన్ల రద్దుకు బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తుందని రేవంత్ అంటున్నాడు. తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది బీఆర్ఎస్. పార్లమెంటులో కొట్లాడింది మేం.. రేవంత్‌ది అతితెలివి లేదా మతి మరుపు.. గోబెల్స్ ప్రచారంతో ఎంపీ ఎన్నికల గండం గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నాడు అని అన్నారు.

హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ అంటున్నడు. పేదలు, రైతులు, గిరిజనుల గురించి మాట్లాడడం లేదు, సెంటిమెంట్స్ రెచ్చగొడుతున్నారు.. రిజర్వేషన్లు పెంచడమే కాని రద్దు చేసేది ఉండదు అని హరీష్ తెలిపారు.

రేవంత్ అధికారంలోకి వచ్చాక కందిపప్పు, స్టీలు, సిమెంట్, కంకర, ఇసుక రేట్లు పెరిగాయి. పేదవాడు కండుపునిండా తినే పరిస్థితి లేదు.. ప్రజల అజెండా పక్కకుపోయిన సెంటిమెంట్ల అజెండా ముందుకొస్తున్నది. విజ్ఞులైన కరీంనగర్ ప్రజలు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్‌ను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉన్నది అని పిలుపునిచ్చారు.

బీసీలపై రేవంత్ ప్రేమ వెయ్యి ఎలకలు తిని తీర్థయాత్రలకు పోయిన పిల్లి తీరులా ఉన్నది. బీసీలకు అత్యధికంగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది మేం.. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసింది మేం.. బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని తీర్మానం చేశామని గుర్తు చేశారు.

అదానీని అలాబ్ బలాయ్ చేసుకుని, మోదీని బడే భాయ్ అని పొగిడి బీజేపీతో కుమ్మక్కయింది రేవంత్.. ఆజ్ తక్ ప్రోగ్రాంలో బీజేపీకి ఓటు వేయాలని కోరాడు. రేపు నామినేషన్ ఆఖరు అనగా అభ్యర్థులను తేల్చకుండా బీజేపీకి సహకరించాడు. కరీంనగర్లో బీజేపీ గెలుపు కోసం బలహీన అభ్యర్థిని నిలబెట్టాడు. రేవంత్ ఫైటర్ అని బండి సంజయ్, అర్వింద్ పొడుగుతున్నారు.. ఎవరు ఎవరితో కుమ్మక్కయారో ప్రజలకు అర్థమవుతున్నది.. కుమ్మక్క రాజకీయాలకు ప్రజలు ఓటుతో చరమగీతం పలకాలి అని కోరారు.

కరీంనగర్ అభివృద్ధి కోసం పాటుబడిన వినోద్ కుమార్‌ను గెలిపించుకోవాలి. ఆయన కేంద్రంతో కొట్లాడి రైల్వే లైన్, స్మార్ట్ సిటీ తెచ్చాడు. కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలంటే ప్రశ్నించే గొంతుకైన వినోదన్నను గెలిపించాలి అని హరీష్ అన్నారు.

కేంద్రంలో బీజేపీ ఉన్నా బండి సంజయ్ చేసింది ఏమన్నా ఉందా? మాటలు తప్ప చేతలు శూన్యం.. బీజేపీ కార్యకర్తల కష్టసుఖాలు కూడా పట్టించుకోలేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్లో మంచినీళ్లకు బదులు మురికి నీళ్లు వస్తున్నాయి అని ధ్వజమెత్తారు.

రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.. ప్రజలను ఒక్కసారి మోసం చేయగలవు గాని ఎల్లప్పుడూ మోసం చేయలేవు.. కేసీఆర్ బస్సు యాత్రతో ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు అని అన్నారు.