హైదరాబాద్ లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ప్రారంభమైంది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్లపై సమావేశంలో చర్చ జరుగనుంది. తెలంగాణకు చెందిన చనాకా – కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లపై చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకటనగరం పంప్ హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్లపై అధికారులు సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ తరుపున స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావు, ఓఎస్డీ దేశ్ పాండే హాజరవగా… ఏపీ నుండి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఈఎన్సీ నారాయణ రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

