హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పై క్రేన్లను సిద్ధం చేసింది. నిమజ్జనం కోసం భారీగా భద్రతను ఏర్పాటు చేయనుంది. ట్యాంక్ బండ్ పై మొత్తం 22 క్రేన్లను అందుబాటులోకి తెచ్చారు. హుస్సేన్సాగర్ చుట్టూ 12వేలకుపైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన చోట అదనపు క్రేన్లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం క్రేన్ నంబర్ 4 వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. అటు ఇప్పటికే సాగర్ చుట్టూ ఉన్న 200 సీసీ కెమెరాలతో పాటు అదనంగా మరికొన్ని కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు పోలీసులు అనుసంధానం చేయనున్నారు.

