కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా శుక్రవారం తెలంగాణ మొత్తం రైతు ధర్నాలతో హోరెత్తుతోంది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు నిర్వహించారు. జిల్లా, మండల కేంద్రాల్లో నిర్వహించిన రైతు ధర్నాల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్, సిద్దిపేట జిల్లాలో హరీశ్రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్, నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి, సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి, వనపర్తిలో నిరంజన్ రెడ్డి, హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, వరంగల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా “తెలంగాణకు ఒక న్యాయం …పంజాబ్ కు ఒక న్యాయమా…?, తెలంగాణ భారతదేశంలో భాగం కాదా…?, తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనదు..?, తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలి.., తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకు…?” అంటూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, రైతులు ధర్నాలలో నినదించారు.

