mt_logo

ట్యాపింగ్ కాదు.. ఫోన్ లో రికార్డ్ చేసిందే!

ఓటుకు నోటు కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిదేనని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తేల్చినట్లు సమాచారం అందింది. ఆడియో ట్యాప్ చేసింది కాదని, ఫోన్ లో రికార్డు అయిందేనని, చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు కట్ అండ్ పేస్ట్ కాదని ఎఫ్ఎస్ఎల్ తన నివేదికలో పొందుపరచినట్లు తెలిసింది. అంతేకాకుండా సమగ్ర నివేదికను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు బుధవారం మధ్యాహ్నం ఏసీబీకి అందించబోతున్నట్లు సమాచారం. అన్నీ ఒక కొలిక్కి వస్తే గురువారం చంద్రబాబుకు నోటీసులు కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. అయితే టీవీల్లో ప్రసారమైన ఆడియో టేపులలో గొంతు తనదికాదని, కట్ అండ్ పేస్ట్ చేశారని, ట్యాప్ చేశారని రకరకాలుగా చెప్పిన చంద్రబాబు దీంతో ఖంగుతినడం ఖాయం!

నివేదిక అందిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుండి నివేదిక బుధవారం కానీ గురువారం కానీ తమకు అందిన వెంటనే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు రాజ్యసభ ఎంపీలు, పలు ప్రైవేట్ కంపెనీల సీఈవోలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *