mt_logo

రేపటి నుండి ఇంటింటికి కోవిడ్ వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ : సీఎస్ సోమేశ్ కుమార్

రాష్ట్రంలో రేపటినుండి 18 సవంత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు గ్రామస్థాయిలో ప్రారంభమయ్యే ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో హనుమకొండ కలెక్టరేట్ నుండి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ స‌భ్యులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు స్వచ్చంద సంస్థలు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నుండి తెలంగాణ ప్రజలను కాపాడటానికి ప్రతిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, ప్రస్తుతం రాష్ట్రంలో  కరోనా పూర్తి నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకూడదనే సదుద్దేశంతో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నట్టు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు  2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని, ఇప్పటి వరకు రెండు కోట్ల 17 వేలమందికి వాక్సిన్ ఇచ్చామని తెలిపారు. వీరిలో ఒక కోటి 45 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింద‌ని, 55 లక్షల మందికి సెకండ్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్పూర్తితో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలని, తహసిల్దార్, యం.పి.డి.ఓ, మెడికల్ ఆఫీసర్ మండల స్థాయిలో సమన్వయం చేసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో బాగా పనిచేసిన జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అవార్డులు ప్రకటిస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1,34,98,073 మంది ఇంకా వాక్సిన్ తీసుకోవాల్సి ఉందని వీరందరికీ రేపటి నుండి ప్రారంభమయ్యే స్పెషల్ వాక్సినేషన్ కార్యక్రమంలో వేయడం జరుగుతుందని అన్నారు. అన్ని గ్రామాలు, పట్టణాలలో ఇంటింటికి ఆశా, అంగన్వాడీ, స్థానిక సంస్థల సిబ్బంది వెళ్లి వాక్సిన్ తీసుకోనివారి జాబితాను రూపొందిస్తారని, గుర్తించిన వారికి వాక్సిన్ ఇచ్చి ఆ ఇంటిపై వాక్సిన్ కు సంబందించిన స్టిక్కర్ వేస్తారని తెలియజేశారు. ప్రతీ మున్సిపాలిటీకి, మండలానికి వాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్ ను నియంనించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫ‌రేన్స్‌లో వివిధ శాఖల కార్యదర్శులు, వైద్య అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *