mt_logo

తెలంగాణలో మలబార్ గోల్డ్ భారీ పెట్టుబడి

జువెల్లరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సంస్థ అధినేత ఎం.డి. అహ్మద్ సమావేశమై తమ నిర్ణయాన్ని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతలతో పాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయన్న మలబార్ గ్రూప్ ప్రతినిధులు, తమ గ్రూప్స్ కు అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని, తెలంగాణలో తాము ప్రతిపాదిస్తున్న పెట్టుబడి ద్వారా తమ కంపెనీ జ్యువెలరీ మాన్యుఫాక్చరింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం రూ.750 కోట్ల పెట్టుబ‌డిని తెలంగాణలో పెట్టనున్నట్టు, ఈ పెట్టుబడి ద్వారా గోల్డ్, డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్‌ల‌ను ఏర్పాటు చేయనున్నట్లు మలబార్ గ్రూప్ తెలిపింది. తమ పెట్టుబడితో సుమారు 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయంది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణాలో ఉన్న వ్యాపార అనుకూలతలను పరిగణన‌లోకి తీసుకొని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్‌కు ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణ కారులకు ఉపాధి అవకాశాలు లభించడం అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయమని అన్నారు. తెలంగాణలో ఈ వృత్తిలో కొనసాగుతూ అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు పలు జిల్లాల్లో ఉన్నారని, కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణన‌లోకి తీసుకోవాలన్నారు. మలబార్ గ్రూప్ తమ పెట్టుబడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం వైపునుంచి అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *