హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్, 2022లో జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బీ.ఆర్.కె. ఆర్ భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ… నగరంలో కాలుష్య కారక గణేష్ విగ్రహాలను ఉపయోగించవద్దని, పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను ట్యాంక్ బ్యాండ్ తోపాటు నగరంలోని ఇతర చెరువుల్లో కూడా నిమజ్జనం చేయవద్దని రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు వినియోగించే విధంగా నగర వాసులను చైతన్య పర్చాలని పేర్కొన్నారు. ఈ అంశాలపై విగ్రహ తయారీదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. నగరంలో మట్టి వినాయకుల తయారీ దార్లను ప్రోత్సహించడం తోపాటు మట్టి విగ్రహాల మార్కెటింగ్ కు తగు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించేందుకు చర్యలు తీసుకోవాలని సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు సి.వి. ఆనంద్, మహేష్ భగవత్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, కాలుష్య నియంత్రణా మండలి కార్యదర్శి నీతూ పప్రసాద్ పాల్గొన్నారు.