mt_logo

ఉస్మానియా ఆస్పత్రికి 24 అంతస్తులతో ట్విన్ టవర్స్

సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడుగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో వైద్యరంగంలో పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రులలో కార్పొరేట్ సదుపాయాలు, యంత్ర పరికరాలు సమకూర్చాలని, సౌకర్యాలు మెరుగుపరచాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కొత్త వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య జిల్లాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి వాటి పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలని, ప్రస్తుతం ప్రభుత్వ వైద్య శాఖలు వివిధ విభాగాల కింద పనిచేస్తున్నాయని, డాక్టర్లు కూడా చాలా విభాగాలలో విడిపోయారని, వైద్య శాఖలను, వైద్యులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సీఎం సూచించారు. 20 నుండి 25వేల జనాభాకు ఒక పీహెచ్ సీ, ప్రతి నియోజకవర్గంలో వంద గ్రామాలకు ఒక ఏరియా ఆస్పత్రి ఉండాలని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆస్పత్రిగా, ఏరియా ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులుగా అభివృద్ధి చేయాలన్నారు.

హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యాన్ని మెరుగుపరచాలని, ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి కొత్త భవన నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించాలని, పాత భవనంలో వైద్య సేవలను కొనసాగిస్తూనే కొత్తగా రెండు టవర్లలో 12 అంతస్తుల చొప్పున 24 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించాలని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా 1100 పడకల స్థాయినుండి దానిని 2500 పడకల సామర్ధ్యానికి పెంచాలని స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిని 1600 పడకల నుండి 2వేల పడకల సామర్ధ్యానికి పెంచాలని, నీలోఫర్ ఆస్పత్రిలో కొత్త భవనాన్ని వినియోగించుకోవడంతో పాటు అదనంగా 500 పడకల సామర్ధ్యానికి పెంచాలని సూచించారు. వరంగల్ ఎంజీఎం ను వెయ్యి పడకల నుండి 2వేల పడకలకు సామర్ధ్యం పెంచాలని, నిమ్స్ లో కూడా అదనంగా 500 పడకల సామర్ధ్యంతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ రిమ్స్ లలో 500 పడకల నుండి వెయ్యి పడకలకు సామర్ధ్యం పెంచాలని సూచించారు.

రాష్ట్రంలోని వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్తులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని, వైద్యులతో పాటు ఇతర సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ఫైళ్ళను వెంటనే రూపొందించి పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ బీ రమేష్, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చంద్ర, వైద్యవిద్య సంచాలకులు పుట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *