![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2024/03/InShot_20240307_121948043-scaled.jpg?resize=1200%2C675&ssl=1)
అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందని.. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది అని అన్నారు.
వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే, అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడికక్కడే ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారు అని గుర్తు చేశారు.
రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ, ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్.. ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలి అని హరీష్ రావు పేర్కొన్నారు.
జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు, ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.