mt_logo

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది.. అందుకే మార్చి 1న ‘ఛలో మేడిగడ్డ’: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి స్పందిస్తూ.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మార్చ్ 1వ తేదీన ఛలో మేడిగడ్డ కార్యక్రమం తీసుకున్నాం.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతాం అని తెలిపారు.

కాళేశ్వరంలో ఉన్న ప్రతి రిజర్వాయర్ని సందర్శిస్తాం.. మాతో కాంగ్రెస్ మంత్రులు వస్తాము అంటే వారిని కూడా వెంట తీసుకువెళ్తాం.. ప్రజలకు కాలేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తాం.. మేడిగడ్డ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండబెడతాం అని స్పష్టం చేశారు.

మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తున్నది..కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసి ప్రాజెక్ట్, సింగూర్,  పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయి.. పాడైన బరాజుల మరమ్మత్తుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నాయి అని కేటీర్ అన్నారు.

సులువుగా ఒక కాఫర్ డ్యాంని నిర్మాణం చేసి ఆ మూడు పిల్లర్లకు వెంటనే మరమత్తులు నిర్వహించవచ్చు.. మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే… అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసనసభలోనే మేము చెప్పాము.. మీరు వేసిన ప్రతి విచారణను స్వాగతించాం అని తెలిపారు.

రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్న రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యంగా ఉండాలి. కాఫర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమత్తులు నిర్వహించండి. రానున్న వేసవిలో మంచినీళ్లు ఇవ్వలేము.. సాగునీరు ఎట్లిస్తాం అని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. అవసరమైతే మాపైన దుష్ప్రచారం చేయండి… ఇంకేమైనా చేయండి కానీ రైతుల జీవితాలను మాత్రం దెబ్బతీయకండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

.మూడు పిల్లర్ల నష్టాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ మానివేసి, ప్రాజెక్టు మరమత్తుల పైన దృష్టి సారించాలి. మరమ్మతులు నిర్వహించకపోతే మూడు బరాజులు కొట్టుకుపోవాలని కుట్రను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది.. రానున్న వర్షాకాలంలో మూడు బరాజులను, వచ్చే వరదతో కొట్టుకపోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుంది.నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చెప్తున్నారు… అన్నారం, సుందిల్ల కూడా కొట్టుకుపోతుందని చెప్పారు. ఇది ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కుట్రపూరిత ఆలోచనలో భాగమే అని విమర్శించారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు సందర్శన లాంటి అన్ని డ్రామాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టండి. మీరు తప్పకుండా కమిటీలు, రిపోర్టుల పేరుతో  కాలయాపన చేయకుండా సమస్యకు పరిష్కారం చూపించండి.. రాష్ట్ర రైతాంగంపైన మా పార్టీపైన కక్షపూరిత వైఖరి మానివేయండి. నిజంగా కాంగ్రెస్ పార్టీకి రైతులపైన… తెలంగాణ పైన ప్రేమ ఉంటే ప్రాజెక్టుకి మరమత్తులు చేసి నీళ్లు ఎత్తిపోయాలి అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కేవలం నేరపూరిత మనస్తత్వంతోనే బరాజ్లకు రిపేర్లు చేయకుండా రోజుకు వేల క్యూసెక్కుల నీటిని ఇప్పుడు కూడా సముద్రంలోకి వదిలిపెడుతుంది. ఇందులో కాళేశ్వరం బ్యారేజీలు అన్ని వర్షాకాలంలో కొట్టుకుపోవాలనే పెద్ద కుట్ర ఉంది అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఈరోజు కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్న కాగ్ రిపోర్ట్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి మొదలుకొని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరూ కాగ్ రిపోర్టుని తప్పుపట్టారు.. కాగ్ రిపోర్ట్ ఒక పవిత్ర గ్రంథం ఏం కాదు అని చెప్పారు. కాగ్ రిపోర్ట్ తప్పు అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు అని గుర్తు చేశారు

ఇదే కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్ జిల్లా యజ్ఞాన్ని అనేక భూముల కేటాయింపును కల్వకుర్తిలో 900 కోట్ల రూపాయలకు గురించి అనేక అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించింది. మరి కాగ్ రిపోర్టు అప్పుడు తప్పు అయితే మరి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలి అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతుంది… కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించాలి అని ఎద్దేవా చేశారు.

ఆనాడు తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు నీళ్ల కోసం, నిధుల కోసం అనేక ఉద్యమాలు చేశారు. బాసర నుంచి భద్రాచలం దాకా పారుతున్న గోదారి జలాల కోసం ఉద్యమాలు నిర్వహించారు. ఎన్ని ఉద్యమాలు చేసినా గోదావరి నీళ్లను తెలంగాణకు అందించలేక పోయినారు ఆనాటి పాలకులు.. 60 ఏళ్ల పాటు తెలంగాణకు నీళ్లు ఇవ్వక కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేసీఆర్ జలసాధన పోరాటం ద్వారా పల్లె పల్లెను జాగృతం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పేరుతో నాటకాలకు తెరలేపింది. పదేళ్లపాటు నాటకాలు ఆడి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకుంది అని కేటీఆర్ విమర్శించారు.

ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఇక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న  మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోకుండా తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తవ్వలేదు. ఒక్క కాలువ కూడా తవ్వకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో అడ్డగోలుగా నిధులు దోచుకున్నారు.  ఆనాటి జల యజ్ఞంలో 52,000 కోట్ల అవినీతి అని కాగ్ రిపోర్ట్ ఎండగట్టింది అని దుయ్యబట్టారు.

10 ఎండ్లలో ప్రాజెక్టులకు ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా సాధించని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు నిపుణులతో, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, మహారాష్ట్రతో సంప్రదించిన తర్వాత గోదావరి నీళ్లను తెలంగాణ పొలాలకు మళ్లించాలన్న సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు అని అన్నారు.

సెంట్రల్ వాటర్ కమీషన్, తుమ్మిడిహట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేదు అన్న తర్వాతనే… నిపుణుల సలహాలు, సంప్రదింపుల తర్వాతనే మేడిగడ్డ వద్ద నీళ్లు తీసుకోవడం మేలని కాలేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కకాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు.. 3 బ్యారేజీలు, 5 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత, 240 టీఎంసీల వినియోగం.. అన్నింటి సమహారమే కాళేశ్వరం అని కేటీఆర్ తెలిపారు.

కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు.. తెలిసినా తెలవనట్లు నాటకాలు ఆడుతున్నారు అందుకే కాలేశ్వరంలో పొంగిపొర్లుతున్న నీళ్లను ప్రజలకు చూపిస్తాం. దుష్ప్రచారం చేస్తున్న మేడిగడ్డకు కూడా మా పార్టీ ప్రతినిధి బృందం వెలుతుంది. కేసీఆర్ గారు నల్లగొండ సభలో చెప్పినట్లు కాళేశ్వరంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శించి ప్రజలకు వివరిస్తాం అని అన్నారు.

లక్ష కోట్ల కాళేశ్వరం అని ఒకవైపు, 3000 కోట్లతో కట్టిన మేడిగడ్డను చూపించి ఇదే కాళేశ్వరం గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డలో పాడైన మూడు పిల్లర్లను చూపించి కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. 40 లక్షల ఎకరాలకు నీరు అందించే కామధేనువు కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ టోపోగ్రఫీకి ఉన్న సవాళ్ల వల్లనే, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా అన్ని ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసాం అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నో కేసులు వేసి ప్రాజెక్టు కట్టకుండా అడ్డంకులు సృష్టించింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేసీఆర్‌కి పేరు వస్తుందని దుర్మార్గంగా వ్యవహరించింది. కాంగ్రెస్ కుట్రలకు దాటుకుని 400 పైగా అనుమతులు సాధించాం.. కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16.4 టీఎంసీలు, రిజర్వాయర్లు లేకుండా ప్రాజెక్టు ఉంటే,  142 టీఎంసీల రిజర్వాయర్లను కాళేశ్వరంలో నిర్మించాం అని కేటీఆర్ తెలిపారు

తెలంగాణ కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు ద్వారా 40 లక్షల ఎకరాలను చేసే ప్రాజెక్టే కాళేశ్వరం. తెలంగాణకు ఉన్న భౌగోళిక పరిస్థితుల పరిమితుల వల్లనే ఎంత ఖర్చయినా ఎత్తిపోతల పథకాల ద్వారానే నీళ్ళిచ్చే అవకాశం ఉన్నది.. నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ రైతన్నల కోసం ఎంత ఖర్చైనా నీళ్లు ఇవ్వక తప్పదు. కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న మేధావులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.

ఆకలికేకల తెలంగాణ అన్నం గిన్నగా మారింది… దేశానికి అన్నపూర్ణగా అయింది. మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించారు.. మూడు లక్షల రూపాయలు ఉండే ఎకరం ధర ఈరోజు 30 లక్షలు అయింది… ఇవన్నీ కాళేశ్వరం ద్వారా అందిన ప్రతి ఫలాలు కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.