తెలంగాణాలో పండించే వడ్లు కొంటరా ? కొనరా ? అంటూ కేంద్రానికి సూటి ప్రశ్న వేశారు సీఎం కేసీఆర్. గురువారం టీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేసీఆర్.. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “అర్థం కాని భాషలో అడగటం లేదు మేము, ఒకటే సాఫ్.. సీదా ముచ్చట.. ఇక్కడ పండిన వడ్లు కొంటారో లేదో సూటిగా చెప్పండి” అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
‘రైతుల గోస ఒక తెలంగాణలోనే లేదు. భారతదేశం మొత్తం ఉంది. ఒక ఏడాది కాలం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో వేల లక్షల మంది రైతులు వరుస నిరాహార ధీక్షలు చేస్తున్నారు. పంటలు పండించే శక్తి లేక కాదు. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలుగా మాట్లాడుతోంది. బీజేపీ నాయకులు కూడా రైతు చట్టాల మీద వంకర టింకర మాట్లాడుతున్నారు. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీల ప్రభుత్వాలు దారుణంగా విఫలం చెందాయి. పంటలు కొనడానికి మీకు భయం అవుతుంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ 101వ స్థానంలో ఉంది. ఇంతకన్న సిగ్గుచేటు ఏమైనా ఉంటదా ? దేశంలో 12 కోట్ల మంది రైతుల ఉన్నారు. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అద్భుతమైన నదులున్నాయి. బంగారు పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. దాదాపు సగం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. కానీ వ్యవసాయ రంగాన్ని, రైతులను పట్టించుకోవడం లేదు. దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినట్టు, వ్యవసాయ భూములను కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. దీనిపై మేము చూస్తూ ఊరుకోం.. ఎంతదాకా అయినా వెళతాం’ అని సీఎం కేంద్రంపై ధ్వజమెత్తారు.
‘మేం రాష్ట్రం తెచ్చుకుని, చెరువులను బాగు చేసుకుని, చెక్డ్యాంలు కట్టి, కరెంట్ ఇచ్చి రైతులను బాగు చేసుకున్నాం. పంటలు పండించుకున్నాం. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. కానీ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది. రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. హంగర్ ఇండెక్స్లో భారత్ ఆకలి రాజ్యం అని తెలుస్తోంది. దేశంలో ఏ మూలలో ఆహార కొరత ఉందో గమనించి దాన్ని సమన్వయం చేయాలి. అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి ఆహారం అందించాలి. సమస్య ఉన్నదంతా కేంద్రం వద్దే. కేంద్రం మీద యుద్ధం ప్రారంభమైంది. ఉత్తర భారత రైతాంగం కేంద్రానికి నిరసన వ్యక్తం చేస్తోంది. రైతుల జీవితాలపై చెలగాటమాడుతోంది. కార్లతో తొక్కి చంపుతోంది. ఇవాళ తెలంగాణ రైతులపై బీజేపీ నేతలు కన్నేశారు. అబద్దాలు సృష్టించి, సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద విధ్వంసం సృష్టిస్తున్నారు. రైతులను బతకనిస్తారా? బతకనివ్వారా?’ అని కేసీఆర్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. వడ్లు వేయండి.. మెడలు వంచి కొనిపిస్తాం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ సవాల్ కేంద్ర నాయకుల వద్ద విసరాలని సీఎం సూచించారు.