mt_logo

పాలమూరు ఎత్తిపోతల పథకం రెండేళ్లలో పూర్తిచేయాలి- సీఎం కేసీఆర్

పాలమూరు-రంగారెడ్డి జిల్లాల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూచించారు. ఈరోజు క్యాంప్ ఆఫీస్ లో ఈ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తిచేయాలని, పంప్ హౌజ్ లు, కాల్వల పనులు సమాంతరంగా జరగాలని, అదేవిధంగా జలాశయాలు, టన్నెళ్ళ పనులు కూడా పూర్తికావాలని ఆదేశించారు. రెండు వారాల్లో సర్వే చేసి డిజైన్లు రూపొందించి టెండర్లు పిలవాలని, ఎక్కవ ఏజెన్సీలను నియమించి ప్రాజెక్టుల సర్వేలు త్వరగా పూర్తిచేయాలని సీఎం సూచించారు.

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తానని, ప్రతి సోమవారం సమీక్ష జరపాలని కేసీఆర్ చెప్పారు. బడ్జెట్ లో నీటిపారుదల ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యం అని, అధికారులు అలసత్వం చూపకుండా పనిచేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు వెంటనే బిల్లులు చెల్లిస్తామని, ప్రాజెక్టు పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని సీఎం స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా భూసేకరణ పూర్తిచేయాలని, రైతుల భూములు, ఇండ్లు, స్థిరాస్తులకు విలువ కట్టి వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ సరఫరాకు జెన్ కో, ట్రాన్స్ కో తో సమన్వయం చేసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *