తెలంగాణలో పరస్పర ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులిద్దరూ పరస్పరం అవగాహనకు వస్తే వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించాలని సీఎస్ సోమేష్కుమార్కు బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ సూచించినట్టుగా తెలిసింది. అలాగే భార్యాభర్తల కేసులను తక్షణం పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే బదిలీలపై రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
కాగా బుధవారం బీఆర్ఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను టిఎన్జీఓ నాయకులు కలిసి, ఉద్యోగుల జోనల్ విభజనలో పరస్పర బదిలీలకు, భార్యాభర్తల కేసులకు అవకాశం ఇచ్చి బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జీఓను అనుసరించి లోకల్ క్యాడర్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉద్యోగులకు పరస్పర బదిలీలకు, భార్యాభర్తల కేసులకు, ఆప్షన్ల ప్రక్రియలో సీనియర్ జూనియర్లకు మధ్య జరిగిన పొరపాట్లను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని టిఎన్జీఓ నాయకులు కోరారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి టిఎన్జీఓలు తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాలను, స్పౌస్ కేసులు, మ్యూచువల్ కేసులతో పాటు అప్పీల్స్ను పరిష్కరించడం లాంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని ఈ సందర్భంగా సీఎస్ సోమేష్కుమార్ టిఎన్జీఓ నాయకులకు హామీ ఇచ్చారు.