లోక్ సభలో బొగ్గు గనులపై జరిగిన చర్చలో నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ, బొగ్గు గనుల కుంభకోణం దేశానికి చెడ్డ పేరు తెచ్చిందని, బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తుందని, దీనివల్ల వేలాదిమంది కార్మికుల సంక్షేమం ప్రశ్నార్ధకంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో 70 వేలమంది కార్మికులు పని చేస్తున్నారని, దేశంలో అత్యధికంగా సింగరేణి గనుల నుండే బొగ్గు ఉత్పత్తి అవుతుందని అన్నారు.
బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ప్రైవేటు యాజమాన్యాలు యూనియన్లను బలహీనపరుస్తాయని, కార్మికుల సంక్షేమం పట్టించుకోవని పేర్కొన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశ ప్రజలు మోడీని విశ్వసిస్తున్నారని, తమ విన్నపాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని ఎంపీ కోరారు. కేంద్రం బొగ్గుగనుల కేటాయింపుల్లో కోల్ ఇండియా తరహాలో సింగరేణి బొగ్గు గనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నార్త్ ఇండియాతో పాటు తమిళనాడు, తెలంగాణలోని వేలాదిమంది కార్మికులు బొగ్గుగనులపై ఆధారపడి నివసిస్తున్నారని, బొగ్గు గనులు ప్రైవేటీకరిస్తే వారి పరిస్థితి ఏమిటని కవిత ప్రశ్నించారు.