సాయుధ దళాల్లో పని చేసిన సైనికులను మనం గౌరవించుకోవాలి కానీ ఆర్థిక భారంగా పరిగణించరాదని కర్ణాటక ప్రభుత్వానికి హితవు పలికారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా, ఇతర సదుపాయాలను నిలిపివేసి, కేవలం ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ పైవిధంగా స్పందించారు. జాతీయవాదం గురించి పెద్దగా మాట్లాడే పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవమానకరమని, ఈ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర సహాయంతో సంబంధం లేకుండా, దేశంకోసం ప్రాణాలర్పించిన తెలంగాణకు చెందిన పలువురు అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగంతోపాటు, భూమి, పరిహారం అందించారని… అంతేకాకుండా వివిధ రాష్ట్రాల అమరవీరులకు కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా 10 లక్షల ఆర్థికసహాయం చేశారని వెల్లడించారు.
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా, ఇతర సదుపాయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ సైనికులు తీవ్రంగా వ్యతిరేకించారు.