తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ లోని అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి సభకు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని అన్నారు. అమరుల ఆశయాలు ఫలించాయని, ఇదే సభలో గత పాలకులు తెలంగాణను అవహేళన చేశారని, అన్నింటిని మించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఎన్నో అవమానాలకు గురైన చోటనే బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని ఈటెల పేర్కొన్నారు.
ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేశామని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యమని, ప్రభుత్వం తమను తాము పాలించుకుంటుంటే దుష్టశక్తులు ఎన్నో అవాంతరాలు సృష్టిస్తున్నాయని, సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన అన్ని రంగాలను ప్రగతిపథంలో నడిపిస్తామని చెప్పారు.