తెలంగాణ భవన్ లో రేపు ఉదయం 10 గంటలకు టీఆర్ఎస్ పార్టీ అత్యవసర సమావేశం జరుగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. శనివారం జరగబోయే సమావేశానికి అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ ఇన్చార్జిలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరుకావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, కేసీఆర్ పాల్గొనే బహిరంగసభలపై చర్చించనున్నారని తెలిసింది. ప్రచారసమయంలో హాలోగ్రాఫిక్ త్రీడీ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా ఒకేసారి 20 చోట్ల కేసీఆర్ ప్రసంగిస్తున్న అనుభూతి కలుగుతుందని పార్టీ శ్రేణులు చెప్పాయి.
ఈ నెల 13న కరీంనగర్ బహిరంగసభలో పాల్గొని అదే రోజు నిజామాబాద్ జిల్లా ఎలారెడ్డిలో జరిగే సభలోనూ పాల్గొని గులాబీ బాస్ ప్రచారం మొదలుపెట్టి ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. మొత్తం 35 బహిరంగసభల్లో కేసీఆర్ పాల్గొననున్నారని, రోజుకు కనీసం ఆరు చోట్ల పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒకే జిల్లాలో రోడ్ షోలు, బహిరంగ సమావేశాలు ఉంటే రోడ్డు మార్గంలో వెళ్తారని, ఒక జిల్లానుండి వేరే జిల్లాకు వెళ్ళాల్సివస్తే హెలికాప్టర్ ఉపయోగించనున్నారని సమాచారం. ప్రతిరోజు 20 చోట్ల కేసీఆర్ మాట్లాడిన స్పీచ్ లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. హాలోగ్రాఫిక్ టెక్నాలజీతో ప్రచారం చేయడానికి 20 వాహనాలను రెడీ చేసి అందులో ఒక పెద్ద టీవీని అమర్చి దానికి రికార్డు చేసిన కేసీఆర్ స్పీచ్ ను సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం చేస్తారు. టీవీలో వచ్చే ప్రసంగం చూస్తే ఎక్కడో బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సమయం ఎక్కువగా లేకపోవడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం చేయడమే ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశం.