నిన్న కిరణ్ ప్రెస్ మీట్ సందర్భంగా పలు అర్థసత్యాలు, అబద్ధాలు చెప్పాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా తనకు రాష్ట్ర చరిత్ర గురించి కనీసం అవగాహనలేదనే విషయం నిన్న ఆయన హైకోర్టు గురించి చేసిన వ్యాఖ్యలతో బయటపడిపోయింది.
ఆంధ్ర తెలంగాణ విలీనం కారణంగా హైకోర్టు గుంటూరు నుండి హైదరాబాదు తరలివచ్చిందని, తత్ఫలితంగా నలభై యాభై వేలమంది లాయర్లు హైదరాబాదుకు తరలి వచ్చారని నిన్న కిరణ్ ఒక ప్రస్తావన చేశాడు. అంతమంది లాయర్లు అక్కడినుండి ఇక్కడికి రాలేదని చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. వలసవచ్చిన లాయర్ల సంఖ్య మొత్తం అయిదువేలు దాటదని హైకోర్టులో పనిచేసే లాయర్లే చెప్పుతున్నరు.
1955లో విలీనానికి తెలంగాణ ప్రజలు విముఖత చూపడంతో దానికి పరిష్కారంగా తాము తెలంగాణ ప్రజలకు అనేక రక్షణలు ఇస్తామని ఆంధ్ర నాయకత్వం ముందుకు వచ్చిన విషయం మనకు తెలుసు. ఆంధ్ర తెలంగాణ నాయకులు “పెద్దమనుషుల ఒప్పందం” డిల్లీలో రాసుకునే సమయంలో తెలంగాణ నాయకులే స్వయంగా హైకొర్టు ప్రధాన కేంద్రం హైదరాబాదులో ఉన్నా గుంటూరులో ఇంకొక బెంచీ (శాఖ) ఉండాలని ప్రతిపాదించారు. అయితే అప్పటికే హైదరాబాదు మీద యావతో కండ్లు మూసుకుపోయిన సీమాంధ్ర నాయకత్వం విచిత్రంగా తమకు గుంటూరు బెంచీ వద్దని, మొత్తం హైకోర్టు హైదరాబాదులోనే ఉండాలని భీష్మించుకున్నారు.
ఇదిగో పెద్ద మనుషుల ఒప్పందం అసలు ప్రతిలో సీమాంధ్ర నాయకుల నిర్వాకం నలుపు తెలుపులో ఉన్నది చూడండి:
—
ఆనాడు తెలంగాణ నాయకులు సూచించినట్టు గుంటూరులో హైకోర్టు బెంచీ పెట్టినట్టయితే ఇవ్వాళ ఇంతమంది న్యాయవాదులు హైదరాబాదుకు వలస వచ్చే బాధతప్పేది కదా? ఆ అవకాశాన్ని చేజేతులా కాలదన్నుకున్నది ఆంధ్ర నాయకులే కదా? వాస్తవం ఇలా ఉంటే మరి విలీనం వల్ల సీమాంధ్ర న్యాయవాదులు నష్టపోయారని కిరణ్ బొంకుతున్నాడెందుకు?
గత కొన్నేళ్లుగా గుంటూరులో న్యాయవాదులే తెలంగాణ ఏర్పడాలని, తద్వారా తమ పట్టణానికి హైకోర్టు రావాలని ఆందోళన చేస్తున్న విషయం మరి నల్లారి కిరణ్ కు తెలుసో లేదో మరి.
తమ ప్రాంతం అభివృద్ధి పట్ల సీమాంధ్ర నాయకత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో గుంటూరుకు హైకోర్టు బెంచీ వద్దన్న వారి నిర్వాకం చూస్తేనే అర్థం అవుతుంది. నిజానికి సీమాంధ్ర నాయకులకు తెలంగాణ ప్రజలపట్లనే కాదు, సీమాంధ్ర ప్రజల పట్ల కూడా ఏ ప్రేమా లేదని ఆనాటి నుండి, ఈనాటి వరకు వారి ప్రవర్తన నిరూపిస్తున్నది.