mt_logo

అమ్మో.. ఆ ముగ్గురు బాబులు

అల్లం నారాయణ

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు, దోపిడీ ఇవన్నీ ఎన్ని సమస్యలున్నా సరే… భరించవచ్చునేమొ కానీ ఇలాంటి ముగ్గురు బాబుల నాయకత్వాన్ని భరించే శక్తి ఇకలేదు. వీళ్లను తప్పించుకోవడం కోసమన్నా మా తెలంగాణ మాగ్గావాలె… అమ్మో.. ఆ ముగ్గురు…. పాపం సీమాంధ్ర ప్రజలకు వేరే ఏదైనా రూపంలో ఉపశమనం లభించుగాక….

భూదేవికున్నంత ఓపిక ఉంటే తప్ప తట్టుకోలేని స్థితి. తెలంగాణ పరిస్థితి ఎట్లా తయారయ్యిందంటే ఒకవంక ఢిల్లీ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. వాళ్లు ఒకదాని వెంట ఒకటిగా ఏదో ఒకటి చేస్తున్నట్టుగా చెబుతూ ఉంటారు. కానీ అదే ఢిల్లీ పీఠం వల్ల ఇక్కడ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కిరణ్ కుమార్‌డ్డి ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడుతుంటారు. విలేకరుల సమావేశాలు పెట్టి హేతురహితంగా, తర్క రహితంగా ఊహలకు రెక్కలు తొడిగి, అపోహలను అలంకరించి జనం మీదకు వదులుతూ ఉంటారు. మరోవేపు ఛానళ్ల దాడి. ఏకపక్షం. పత్రికల్లో ప్రొఫెసర్ల పేరిట రాసే కడహీనపు అజ్ఞానపు, వైరుధ్యపు రాతలు.

పత్రికలు చదువుదామంటే గుబులు. ఛానళ్లు చూద్దామంటే దిగులు. ఒక కిరణ్‌ను తట్టుకుని సరేలే! ఆయన అట్లానే మాట్లాడుతాడు. జరిగేది జరగకపోతుందా? అనుకుని సమాధానపడి రక్తపోటు తగ్గించుకుందామనుకునే సరికి చంద్రబాబు తయారవుతాడు. ఆయన బాధ ఏమిటో? ఎవరికీ అర్థం గాదు. లేఖ ఇచ్చినా అంటడు. విభజన పాపం అంటడు. ఇట్లా విభజించకూడదు అంటడు. రాజకీయాల కోసం అంటడు. ఏదో ఒక దాని కోసం విభజన అయితే నీ సొమ్మేం పోయింది? అంటే మాట్లాడడు. ఇంతకూ నువ్వు అటా? ఇటా? అంటే మాట పెగలదు. నీకెందరు పిల్లలు అంటడు. ఆయన ఇబ్బంది ఏమిటో? ఆయన మార్గం ఏమిటో? విధానం ఏమిటో? చివరాఖరుకు ఆ పరమేశ్వరునికి కూడా అర్థం గాదు. నిరాహారదీక్షలు చేసి, ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి అతి పురాతన ప్రశ్నలు వేస్తాడు.

విభజన అంటే అదేదో ఘోర నేరమన్నట్టు, మహాపరాధమన్నట్టు, ప్రపంచం మునిగిపోయినట్టు, సమువూదాలు ఉప్పొంగినట్టు, వీళ్లిద్దరూ సృష్టించే భ్రాంతి ఒకటి మనసును కెలుకుతూ ఉంటుంది సీమాంవూధలో. పురుగు మెసిలి, రోడ్ల మీద ఆర్గనైజ్ చేసి, చాలా చక్కగా, యూనిఫామ్‌లతో సహా విద్యార్థులు ఉద్యమం చేసినట్టు ఛానళ్లు ప్రదర్శిస్తాయి. పత్రికలు రాస్తాయి. పుల్లారావులు, సుబ్బారావులు పత్రికల్లో పంచరంగుల వన్నెలతో ఇది స్వాతంత్య్ర ఉద్యమం కన్నా గొప్పదని, చెబుతూ ఉంటారు. నవ్వాల్నా? ఏడువాల్నా? కోప్పడాల్నా? మనసున పట్టదు. వశంగాదు. కానీ తెలంగాణ ఉద్యమం సాధించిన పరిణితి, స్పష్టత, లక్ష్యం పట్ల గురి, ఉద్యమం కొనసాగి నడిచిన అనుభవాల సారంతో ఏర్పడిన అవగాహన మళ్లీ పూర్వస్థితిలో ఆలోచించే చైతన్యాన్ని ఇచ్చినందువల్ల నిమ్మళంగా బతికి ఉంటాం. అంతే.

ఈ ఇద్దరే అనుకుంటే వీళ్లద్దరి కన్నా ఘనుడు, ఫ్రెష్‌గా జైలు నుంచి వచ్చిన జగన్ ఇవ్వాళ్ల మాట్లాడినది విన్న తర్వాత మళ్లీ…పొద్దున్నే ఒక పత్రికలో అసెంబ్లీ తీర్మానం, అసెంబ్లీ అభివూపాయం అన్న వాటికి ఉన్న తేడాతెలియని ఒక ప్రొఫెసర్ రాసిన వ్యాసంతో మొదలైన రక్తపోటు సాయంవూతానికి జగన్ మాటలు విన్నాక పెరిగింది. తగ్గే మార్గాలేవి. తోడు కిరణ్‌కుమార్‌డ్డి తడవలు తడవలుగా రక్తపోటు పెంచే ప్రయత్నాలు. మధ్యలో చంద్రబాబు ఎంతకూ తేలని మీమాంస? చివరాఖరుకు జగన్నాటకం.

‘బుర్గుల రామకృష్ణ, మండపాటి హనుమంతరావు, సూరవరం ప్రతాపడ్డి’ల గురించి తెలుసా? అని కూడా జగన్ ప్రశ్నించారు. అదీ సోనియాగాంధీని. పేర్లు పలకరానివాడి సంస్కృతీ దారిద్య్రం, భావ దారిద్య్రం భవిష్యత్‌లో ఎన్ని చిక్కులు తెస్తుందో? ఊహించడానికే భయం కలుగుతున్నది. సీమాంధ్ర ప్రజల మీద కొంత జాలి కూడా కలుగుతున్నది. ఇంత భావదారిద్య్రం ఉన్నవాళ్లు, ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నవాళ్లు, ఇన్నేసి కల్పిత అపోహలను ప్రచారంలో పెడ్తున్న వారు మాత్రమే సీమాంధ్ర ప్రజలకు, సమైక్య నినాదానికి నాయకులు కావడం తెలుగు ప్రజలు చేసుకున్న పాపం. ఒక చరిత్ర తెలువదు. భాషరాదు. సంస్కృతి అంతకం తెలియదు. మాట్లాడే వాటిలో కనీసం ఇవి అబద్ధాలని తెలిసినా నరంలేని నాలు కలు వాటిని వదిలిపెడితే స్వీకరిస్తున్న జనం పట్ల కూడా జాలి కలుగుతున్నది.

దేశ పౌరసత్వాన్ని తీసుకున్న సోనియాను ఇటలీకి వెళ్లమనడానికి ఆంధ్రవూపదేశ్‌లో కలిసున్న జనం రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి ఉన్న సంబంధం ఏమిటో? ఈ ప్రసంగం రాసిన రచయిత ఎవరో కానీ తన మేధావిత్వాన్ని పాపం జగన్ మీదకు ప్రయోగించారు. జగన్ తరహాకు, వ్యవహారశైలికి, ప్రసంగానికీ కనీస పొంతన కుదరనే లేదు. మధ్యలో ‘వాళ్లు ముందుగా కమ్యూనిస్టుల కోసం వచ్చారు’ అని స్వేచ్ఛ గురించిన ఆ కొటేషన్ జర్మన్ గురించి ఎందుకు మాట్లాడారో? ఒక్క ముక్కా అర్థం కాలేదు. ఈ అసంగతాలు, అసంబద్ధాలు… చివరికి అంతిమంగా ఒక విరోధాభాస. ‘బుర్గుల రామకృష్ణ’ ఆంధ్రవూపదేశ్‌లో విలీనానికి అంగీకరించిన తర్వాత ఒక మాటన్నారు. అది ఇలాంటి అహంకార జ్ఞాన కోవిదులకు తెలిసే అవకాశమే లేదు. ‘నా మరణశాసనం మీద నేనే సంతకం చేసివచ్చాను’ అన్నది ఆ మాట. దాని లోతు ఎంతో తెలుసా? హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తే మరణశాసనం రాసుకున్నట్టే అని… ఆయనను సమైక్యవాదిగా కీర్తించారు. సరే బావుంది. అప్పటికది పాక్షికంగా నిజం కూడా. పొట్టిశ్రీరాములుకు ఎందుకింత శాపం. ఆయనను బతికుండగా మద్రాసు కోసం నిలువునా చంపేశారు.

అమరజీవి అయ్యారు. దేశంలో విభజన ఉద్యమాలకు, వేర్పాటువాదం ప్రబలి, ప్రత్యేక రాష్ట్రాల కాంక్షలు బలపడడానికి పొట్టి శ్రీరాములు ఒక ఆదర్శం. ఒక నిరాహారదీక్షతో గాంధీ మార్గంలో, శాంతిని నమ్ముకొని పొట్టిశ్రీరాములు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించగలిగారు. సమైక్య సభల్లో వేదికలకు ఆయన పేరు పెట్టడమే పెద్ద విరోధాభాస. ఏం చెబుతాం. చరిత్ర, సంస్కృతి, గతం, ప్రాంతీయ విశిష్టతలు, హైదరాబాద్ ప్రత్యేకతలు వీటన్నింటి మీదా ఇలాంటి వారితో సంభాషించడం ఏమంత ఆరోగ్యకరం. మీరు సంస్కృతి సంగతి మాట్లాడితే వాళ్లు జాతి గురించి మాట్లాడతారు. మీరు జాతి గురించి మాట్లాడితే వాళ్లు నీళ్ల సంగతి మాట్లాడతారు. విడిపోయినాక శ్రీశైలం ప్రాజెక్టుకు, నాగార్జునసాగర్‌కు నీళ్లెట్లావస్తాయంటారు? దేశంలో ఇది ఇరవైతొమ్మిదో రాష్ట్రం. నీళ్లు ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయినా వస్తూనే ఉంటాయి. వానలు పడితే శ్రీశైలం వరదపొంగి, నాగార్జునసాగర్ నిండుతుంది. ఆపితే కృష్ణమ్మ ముంచెత్తి చంపుతుంది. కానీ ఈ ప్రశ్న రాయలసీమ రెడ్లిద్దరూ పదేపదే అడుగుతూనే ఉంటారు. మనం చెబుతూనే ఉండాలి.

ఇవేవీ కాదంటే రాజ్యాంగ వ్యతిరేకం అంటరు. నాలుగేండ్ల కిందట డిసెంబర్ 9న పార్లమెంటులో ప్రకటించి, రోశయ్యతోని చెప్పి, అధిష్ఠానం అసెంబ్లీ తీర్మానం చేసి పంపమంటే, ఖాతరు చెయ్యని అప్పటి స్పీకర్ కిరణ్‌కుమార్‌డ్డి ఇప్పుడు తీర్మానం సంగతి మాట్లాడ్తడు. జూలై 30న ప్రకటించి, ఆగస్టు 8న నోట్ పెడ్తామని కేంద్రం చెప్పి, రెండు నెలలయినంక పెడితే, అదిగో అదీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, అన్నింటికీ వ్యతిరేకం, అంతా హడావుడిగా, ‘టేబుల్ ఐటమ్’గా ఎందుకంటడు. పార్లమెంటులో ప్రకటించిన దాన్ని అపహాస్యం చేసి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తినీ కాలరాసిన వాళ్ల ప్రజాస్వామ్యం సంగతులు మాట్లాడడం ఏమంటాం. ఎట్లా తట్టుకుంటాం.

చదువుకున్న ప్రతి విద్యార్థీ ఉద్యోగం కోసం ఎక్కడికి వెళతారు. అని అడిగే వాళ్లకు ఏమని సమాధానం చెబుతాం. అయ్యా తెలంగాణ దేశం నుంచి విడిపోవ డం లేదు. హైదరాబాద్, బెంగళూరు లెక్క, చెన్నయ్ లెక్క, పూణె లెక్క, ముంబాయి లెక్క ఈ భారత దేశంలనే ఉండే ఒక మహానగరం. ఎవడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే మళ్లా అదే ప్రశ్న. ఏమి చెయ్యగలం. కోపం రాకుండా ఎట్లా తప్పించుకోవడం. జగన్ ది మరీ విచివూతమైన కథ. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఉప్పునీరు తప్ప తాగునీరు ఎక్కడుంది? అంటే దుర్బేధ్యమయిన అజ్ఞానాంధకారానికి ఏమి చెబుతాం. జగన్‌కు ఈ నడమంత్రపు ‘ఘోస్ట్‌రైటర్’ ఎవరో కానీ ఆయనలో చాలా కళలున్నాయి. జాతీయత అంటడు. నీళ్లు అంటడు. ఉప్పునీళ్లంటడు. 30 సీట్లిస్తే ప్రధానిని చేసి సమైక్యం కొనసాగేలా చేస్తానంటడు. మధ్యలో హిట్లర్ అంటడు. జగన్ ఇంతకు సమైక్యవాదియేనా? విప్లవకారుడా? మధ్యలో స్వేచ్ఛ కోసం ప్రసంగాలు ఈ అంతనా పొంతన లేని ప్రసంగాలు విని, మాటలు విని, ఇట్లా ఇంకా నిమ్మళంగా ఉండే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ఇప్పుడు తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అంచనా వేయడంలో కీలక అంశం. నిజమే.

ఈ మిడిమేళపు ముగ్గురు బాబులతోటి ఉండేకన్నా, వాళ్ల మాటలు వినేకన్నా, వాళ్ల చేష్టలు చూసేకన్నా, వాళ్లు ముఖ్యమంవూతులుగా ఉంటే జీవించి ఉండి, వాళ్ల కింద బతికేకన్నా…. ఈ ముగ్గురు బాబులను వదిలించుకోవడానికి ప్రాణాలకు తెగించయినా పోరాడి తెలంగాణ సాధించుకోవడం తప్ప మార్గంలేదు. వీళ్ల ముగ్గు ర్ని భరించేశక్తి, ఓపిక ఇంక లేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు, దోపిడీ ఇవన్నీ ఎన్ని సమస్యలున్నా సరే… భరించవచ్చునేమొ కానీ ఇలాంటి ముగ్గురు బాబుల నాయకత్వాన్ని భరించే శక్తి ఇకలేదు. వీళ్లను తప్పించుకోవడం కోసమన్నా మా తెలంగాణ మాగ్గావాలె… అమ్మో.. ఆ ముగ్గురు…. పాపం సీమాంధ్ర ప్రజలకు వేరే ఏదైనా రూపంలో ఉపశమనం లభించుగాక….

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *