mt_logo

ఓరుగల్లులో విజయవంతంగా ముగిసిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌

ఐదు రోజులుగా క్రీడాభిమానులను అలరించిన జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) సహకారంతో ఓరుగల్లు వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో.. రైల్వేస్‌ 253.5 పాయింట్లతో ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. పురుషుల విభాగంలో ప్రవీణ్‌ చిత్రవెల్‌, మహిళల ఈవెంట్‌లో హర్మిలన్‌ కౌర్‌ బైన్స్‌ ఉత్తమ అథ్లెట్‌ ట్రోఫీలు చేజిక్కించుకున్నారు. మొత్తం 23 జట్లు పాల్గొన్న ఈ మెగాటోర్నీలో 18 జట్లు పతకాల పట్టికలో చోటు దక్కించుకోగా.. 13 స్వర్ణాలతో సహా 36 మెడల్స్‌ తో రైల్వేస్‌ టాప్‌లో నిలవగా, ఏడు స్వర్ణాలు సహా 16 మెడల్స్‌ సాధించిన తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. పోటీల అనంతరం జరిగిన ముగింపు వేడుకల్లో రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ విజేతలకు బహమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్ఛేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..వరంగల్‌లో స్పోర్ట్స్‌ విలేజ్‌ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి 50 ఎకరాల స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. 60వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ పోటీలు వరంగల్‌ ప్రతిష్టను మరింత పెంచాయని కొనియాడారు. మరో ముఖ్య అతిథి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. వరంగల్‌ను క్రీడాహాబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల సహకారంతో కృషి చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *