mt_logo

తెలంగాణలో ఒకేసారి 23 కొత్త జిల్లా కోర్టులు

తెలంగాణ‌లో ఒకేసారి 23 కొత్త డిస్ట్రిక్ట్‌ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2 నుంచి ఇవన్నీ ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పది జిల్లాల్లోనే డిస్ట్రిక్ట్‌ కోర్టులు ఉండేవి. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాల సంఖ్య 33కి చేరింది. అన్ని జిల్లాల కోర్టులకు జడ్జీలను నియమిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులను వెలువరించింది. రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా జూన్‌ 2వ తేదీన ఉదయం పది గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ జెండాను ఎగుర వేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ కోర్టులు కూడా పనిచేయనున్నాయి. పాలనా సంస్కరణల్లో భాగంగా జిల్లాలను 33కు పెంచిన‌ ఫలితంగా కొత్త డిస్ట్రిక్ట్‌ కోర్టులు ఏర్పాటు అయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మను గతంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా కలిసి చేసిన వినతి మేరకు కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుకు అనుమతి లభించింది. న్యాయ చరిత్రలో ఒకేసారి 23 కొత్త జిల్లాల కోర్టులు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో కింది స్థాయిలో కేసుల విచారణ వేగవంతం కానుంది. సత్వర న్యాయం జరుగుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులకు భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. హైకోర్టు కూడా జిల్లాలకు పోర్టు పోలియో జడ్జీలుగా హైకోర్టు న్యాయమూర్తులను అపాయింట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *