mt_logo

180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. కాంగ్రెస్‌కి చీమ కుట్టినట్టైనా లేదు: హరీష్ రావు

తెలంగాణలో రైతులు ఎదురుకుంటున్న సమస్యలపై స్పందిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్  నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. నిన్న వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండాలో క్షేత్రస్థాయి పర్యటన చేశాం.. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది అని తెలిపారు.

ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశామని మాకు చెప్పారు. పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు.. తండాల్లో తాగు నీరు కూడా సరిగా రావడం లేదు అని అన్నారు.

రైతుల మీద శ్రద్ద లేదు గానీ ఈ ప్రభుత్వానికి చిల్లర మల్లర చేష్టలకు పాల్పడుతోంది. 180 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. కనీసం క్షేత్రస్థాయికి అధికారుల బృందాన్ని కూడా పంపలేదు. మళ్ళీ రైతులు అప్పుల పాలవుతున్నారు అని హరీష్ పేర్కొన్నారు.

బ్యాంకు అధికారులు రైతులకు అప్పులు కట్టాలని లీగల్ నోటీసులు ఇస్తున్నారు. అందోల్ నియోజకవర్గం రేగోడ్ మండలంలో గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు అనేక గ్రామాల్లో అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం చెప్పారో తమకూ సంబంధం లేదని రుణాలు కట్టాల్సిందేనని బ్యాంకు అధికారులు గ్రామాల మీద పడుతున్నారు.. బ్యాంకులకు రాజకీయాలకు సంబంధం లేదంటున్నారు. గతంలో అంజుమన్ అధికారులు అప్పుల వసూలుకు రైతులను వేధించినట్టు ఇపుడు వేధిస్తున్నారు అని అన్నారు.

ఇది రుణాల వసూలుకు అనువైన సమయమా.. రైతుపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు బ్యాంకు అధికారులు పడుతున్నారు. రేవంత్ ఎన్నికలప్పుడు ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు.

రైతులకు నాలుగు ప్రధాన హామీలు ఇచ్చి కాంగ్రెస్ నట్టేట ముంచింది. కాంగ్రెస్ ఏ మొహం పట్టుకుని పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడుగుతుంది.. సీఎం రేవంత్‌కు పార్టీ గేట్లు తెరవడం మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల గేట్లు తెరవడం మీద లేదు అని హరీష్ విమర్శించారు.

కేసీఆర్ ఈ ఉదయం పార్టీ నేతలతో మాట్లాడారు.. రైతుల పొలాలు సందర్శించాలని కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించారు.. రేపు, ఎల్లుండి, ఆ మరసటి రోజు పొలాలకు వెళ్లి పంట నష్టం వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు అని తెలిపారు.

తక్షణమే ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. రైతుల పక్షాన అన్ని వేదికల మీద పోరాడతాం.. రాజకీయ చేరికల మీద ద్రుష్టి సారిస్తున్నారు తప్ప రైతు కన్నీటి చారికల మీద దృష్టి సారించడం లేదు అని అన్నారు.

నష్టపోయిన రైతుల వివరాలు ప్రభుత్వం వెంటనే సేకరించాలి.. ఎన్నికల కోడ్ ప్రకృతి వైపరీత్యాల సాయానికి అడ్డుకాకూడదు. రైతులు ఎవ్వరూ బ్యాంకుల అప్పు కట్టకూడదు.. బ్యాంకు అధికారులు ఎక్కడైనా వేధిస్తే రైతులు బీఆర్ఎస్ నేతల దృష్టికి తీసుకురండి.. రైతులను వేధించకుండా ప్రభుత్వం బ్యాంకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే లక్షలాది మంది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తాం.. బాండ్ పేపర్ల మీద రాసిచ్చినా కాంగ్రెస్ నేతలు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, ఫేక్ ప్రచారానికే కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.

యాసంగి వడ్లు వస్తున్నాయి.. ఈ సారి మద్దతు ధరకు రూ. ఐదు వందలు బోనస్‌గా కలిపి ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తాం. రైతులు ధైర్యంగా ఉండండి.. ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని హరీష్ పిలునిచ్చారు.

బోనస్ కోసం రైతులు కూడా ఒత్తిడి పెంచాలి.. పార్టీ కేంద్ర కార్యాలయానికి పంట నష్టంపై వచ్చిన వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాము. మేము ఎన్నికల కోడ్ ఉందని కాంగ్రెస్ లాగా ఏ ఫిర్యాదు చేయం.. రైతులకు సాయం విషయంలో రాజకీయాలకు పాల్పడం అని స్పష్టం చేశారు.