mt_logo

అక్టోబర్ లో అందుబాటులోకి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి..

హైదరాబాద్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అక్టోబర్ లో అందుబాటులోకి రానుంది. దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా అత్యంత ఆధునిక, సాంకేతిక పద్ధతిలో నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ. 184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 754.38 మీటర్ల పొడవు గల బ్రిడ్జి నిర్మాణ పనుల్లో దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మాణ పనులు పూర్తికావడంతో పాటు సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణాలు కూడా పూర్తికావచ్చాయి.

గుజరాత్ రాష్ట్రంలోని బరూచ్ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జి ఇప్పటివరకు అతి పెద్దదిగా ఉంది. దుర్గం చెరువుపై నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డ్ సృష్టించనుంది. 2019 అక్టోబర్ నెలలోగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ విభాగం ఈ పనులను శరవేగంగా కొనసాగిస్తుంది.

ఎక్స్ ట్రా డోన్డ్ సాంకేతిక విధానాన్ని ఈ బ్రిడ్జి నిర్మాణంలో అవలంబిస్తున్నారు. దీంతో వంతెన ఎత్తు గణనీయంగా తగ్గడంతో పాటు చెరువుకు ఇరువైపులా బ్రిడ్జికి, చెరువుకు మధ్యలో ప్రత్యేకంగా పిల్లర్ ను నిర్మించకుండానే పూర్తిచేయనున్నారు. సాంప్రదాయ, సాంకేతిక విధానంలో దుర్గం చెరువు బ్రిడ్జిని నిర్మిస్తే 75 మీటర్ల ఎత్తులో పిల్లర్లను నిర్మించడంతో పాటు చెరువు మధ్యలో కూడా ఇదే ఎత్తులో సపోర్టింగ్ గా మరో పెద్ద పిల్లర్ ను నిర్మించాల్సి వచ్చేది. దీంతో ఎంతో ఎత్తుపై ఈ కేబుల్ బ్రిడ్జి మహానగరాల ప్రమాణాలకు విరుద్ధంగా ఉండేది. ఎక్స్ ట్రా డోన్ సాంకేతిక విధానం అవలంభించడంతో 75 మీటర్లకు బదులుగా కేవలం 57 మీటర్ల ఎత్తుకే ఈ వంతెన పరిమితమయ్యింది. ఈ విధమైన సాంకేతిక పద్ధతిలో కేబుల్ బ్రిడ్జి వంతెన నిర్మించడం ప్రపంచంలోనే ఇది మూడవదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మాదాపూర్, జూబ్లీహిల్స్ ల మధ్య దూరం గణనీయంగా తగ్గడంతో పాటు రంగురంగుల విద్యుత్ కాంతులతో మొట్టమొదటి హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతో పాటుగా మంచి పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది.

 

ఈ బ్రిడ్జి కోసం అవసరమయ్యే “స్టే కేబుళ్ల”ను ఆస్ట్రియా దేశం నుండి ప్రత్యేకంగా తెప్పించారు. బ్రిడ్జి బిల్డర్ పనులు పురోగతిలో ఉండగా, ట్రాక్ భీం ఫ్యాబ్రికేషన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి ప్రీ కాస్టింగ్ పనులు కొండాపూర్ లో జరుగుతున్నాయని మేయర్ తెలిపారు. 25 మీటర్ల పొడవు, 6.5 మీటర్ల ఎత్తుతో ఉండే ప్రధాన బ్రిడ్జి పనులు కొండాపూర్ లో జరుగుతున్నాయన్నారు.

కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో కలిగే సౌకర్యాలు:

– హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ కు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఐకానిక్ గా రూపొందనుంది.

– రోడ్ నం. 36, జూబ్లీహిల్స్, మాదాపూర్ లపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది.

– జూబ్లీహిల్స్ నుండి మైండ్ స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *