mt_logo

‘సమైక్య’ రాజకీయ వైఫల్యం

By: కట్టా శేఖర్ రెడ్డి 

తెలంగాణ ఉద్యమం ఎంత న్యాయసమ్మతమైందో, ఎంత సంయమనంతో సాగిందో ఇప్పుడు జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం చూస్తే అర్థమవుతున్నది. తెలంగాణతో, హైదరాబాద్‌తో కలసి ఉంటే ఎంత ప్రయోజనం ఉందో, ఇప్పుడు విడిపోతే ఎంతగా నష్టపోతామో ఇప్పుడు వాళ్లే చెబుతున్నారు. సీమాంధ్ర నాయకత్వానికి తెలంగాణవాదులపై ఎంత విద్వేషం ఉందో, తెలంగాణ నాయకత్వంపై ఎంత ఉన్మాదపూరితమైన వ్యతిరేకత ఉందో సమైక్యాంధ్ర ఉద్యమంలో బట్టబయలయింది. సమైక్యాంధ్రలో తెలంగాణ ఎంతగా నష్టపోయిందో ఇంతకాలం తెలంగాణవాదులు చెప్పుకోవలసి వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమం, అందులో వ్యక్తమవుతున్న వికృత ధోరణులు, వారు చేస్తున్నవాదనలు తెలంగాణ నినాదంలోని హేతుబద్ధతను మరోసారి రుజువు చేశాయి. తెలంగాణ వాదం ఆరు దశాబ్దాల ఆరాటం. ఒకసారి ఉధృతంగా, ఒకసారి మంద్రంగా ఒక ప్రవాహంలాగా సాగిన ఉద్యమం. ఈ ఉద్యమానికి ఒక వాదం, వాదన ఉన్నాయి. తాత్విక భూమిక ఉన్నాయి. సమర్థత, నిబద్ధత కలిగిన నాయకత్వమూ ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి వాదమూ లేదు, వాదనాలేదు. తాత్విక భూమిక అంతకంటే లేదు. కొన్ని భయాలు, కొండంత దౌర్జన్యం తప్ప వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. వారి వెనుక ఉంది పచ్చి అవకాశవాద, దివాలాకోరు నాయకత్వం. ఏ విలువలూ పాటించని, ఏ మర్యాదలూ తెలియని విధ్వంసకర మీడియా. ఏమాటకు, విధానానికీ కట్టుబడి ఉండని అరాచక నాయకత్వం. సమైక్యత అంటే 23 జిల్లాలు కదలి పోరాడడం. 13 జిల్లాలు చేసేది సమైక్య ఉద్యమం ఎలా అవుతుంది? ఏకపక్షంగా, బలవంతంగా, మందబలంతో మీరు కలిసి ఉండాల్సిందే అనడం నిర్బంధ జీవనాన్ని కోరడం. అవతలివాడి సేచ్ఛపై దాడి చేయడం. ఒక విధంగా ఇది రేప్. ప్రేమించకపోతే, పెళ్లిచేసుకోకపోతే యాసిడ్ పోసి చంపుతా అనేవాడికీ, సమైక్య ఉద్యమం చేస్తున్న నాయకులకు తేడా ఏమీ కనిపించడం లేదు.

విభజన జరిగేప్పుడు జనంలో భయాలు, ఆందోళనలు ఉండడం సహజం. సీమాంధ్ర ప్రజల్లో అటువంటి గుబులు చెలరేగడం సహజం. కానీ సీమాంధ్ర మీడియా వాటిని ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి ఎంత భయపెట్టాలో అంత భయపెడుతోంది మీడియా. విషాదం ఏమంటే సీమాంధ్ర మీడియా జనాన్ని పరుగెత్తిస్తోంది. ఉద్యమం ఎలా చేయాలో చెబుతోంది. వారికి అవసరమైన నినాదాలనూ అందిస్తోంది. కాంగ్రెస్ నాయకులను పిల్లులని, కుక్కలనీ, నక్కలనీ రకరకాల స్టోరీలు చేసి తిట్టిస్తోంది. టీవీల తెరల నిండాకాంగ్రెస్ నాయకులకు ఈ పేర్లు తగిలించి గ్రాఫిక్ ప్లేట్లు ప్రదర్శిస్తోంది. మరుసటి రోజు రోడ్లపై అదేరకం ఫ్లెక్సీలు పట్టుకుని ఆందోళనకారులు వీధుల్లో తిరుగుతున్నారు. టీవీలు జనాన్ని పరిగెత్తిస్తే, నాయకులు వాళ్ల వెంట పరుగెడుతున్నారు. పోటీపడుతున్నారు. రాజకీయంగా పైచేయి సాధించడంకోసం తన్నుకుంటున్నారు. కానీ ‘జనానికి మార్గనిర్దేశం చేద్దాం. వారికి భరోసా ఇద్దాం. విద్వేషాలు పెచ్చరిల్లకుండా చూద్దాం. తెలుగుజాతి విడిపోయినా కలిసి ఉండేట్టుగా కృషి చేద్దాం. పోటీపడి వికాసం సాధిద్దాం’ అని చెప్పగలిగిన ఒక్క ధీమంతుడు కనిపించలేదు. సీమాంధ్ర నాయకుల్లో ఒక్కరంటే ఒక్కరు విజ్ఞత ప్రదర్శించేవారు కనిపించడం లేదు. రాజనీతిజ్ఞత దేవుడెరుగు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి రాజనీతిజ్ఞతను కాదుకదా, కనీస ప్రజస్వామ్యాన్ని కూడా ఆశించలేము. ఆయన డిక్షనరీ వేరు. ఆయన వాళ్ల నాయన రాజశేఖర్‌రెడ్డి కంటే పదహారు ఆకులు ఎక్కువ చదువుకున్నవారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు సమైక్యాంధ్ర నినాదంతో పెడబొబ్బలు పెట్టవచ్చుగాక, కానీ తెలంగాణవాదాన్ని పావుగా వాడుకున్న మొదటి సీమాంధ్ర నాయకుడు వైఎస్సారేనని మరువరాదు. చంద్రబాబునాయుడు నిలబడతారని, టీడీపీని నిలబెడతారని అందరూ ఆశించారు. విభజనకు సహకరిస్తానని ఆయన తొలిరోజు ప్రకటన చేసినప్పుడు అందరూ ఆయనను మెచ్చుకున్నారు. కానీ ఆయన కూడా జగన్‌మోహన్‌రెడ్డితో పోటీపడే ప్రయత్నంలో తొమ్మిదోరోజుకు జారిపోయారు. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ల బాధ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. రెండు ప్రాంతాలకు సమన్యాయం అంటే ఏమిటో చెప్పే స్థితిలో చంద్రబాబు లేరు. అదో బ్రహ్మపదార్థం. హైదరాబాద్‌ను ఏమి చేయాలో ఆయన చెప్పడం లేదు. సీమాంధ్రకు ఎలా అన్యాయం జరుగుతుందో, దానిని ఎలా సరిదిద్దాలో చెప్పడం లేదు. కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టి ప్రయోజనం పొందాలన్నది ఆయన ప్రయత్నం. రాజకీయంగా అంతవరకు సబబే. కానీ పరిష్కారం సూచించకుండా డొల్ల నినాదాలతో ఏమి సాధిస్తారు? విభజనను వ్యతిరేకించడం లేదు అని చంద్రబాబు చెబుతున్నారు. సమైక్యాంధ్రకోసం ఆగస్టు పదిహేడు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని విజయవాడలో దేవినేని ఉమామహేశ్వర్‌రావు చెబుతున్నారు. జగన్ తెలంగాణను వదిలేసుకున్నాడు. ఆయన సీమాంధ్రలో గెలవడంకోసం ఏమయినా చేస్తాడు. చంద్రబాబు కూడా అదే చేయాలనుకుంటున్నారా? తేల్చుకోవాలి. తెలుగుజాతి ఐక్యతను కాపాడడానికి ఈ ధోరణి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అన్నది చంద్రబాబు ఆలోచించాలి.

చాలామంది నాయకులకు సామాన్యులకు ఉండే విచక్షణ, జ్ఞానం కూడా ఉండదని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు మిత్రుల స్పందన చూసిన తర్వాత అనిపించింది. ‘థ్యాంక్సండీ. మాకు రాష్ట్రాన్ని సాధించిపెట్టినందుకు. సొంత రాజధాని వస్తున్నందుకు. శుభాకాంక్షలు- మీ రాష్ట్రం మీరు సాధించుకున్నందుకు. ఇది ఎప్పుడో ఒకప్పుడు తేలిపోవలసిందే. అస్తమానం ఇలా కీచులాడుకోవడం కంటే మంచితనంతో విడిపోవడం మేలు. ఇప్పుడు తేలిపోయింది. ఇది ప్రశాంతంగా ముగిస్తే బాగుంటుంది’ అని హైదరాబాద్‌లో స్థిరపడిన ఒక మిత్రురాలు తక్షణ స్పందన ఇది. ‘తెలుగుజాతి ఐక్యత గురించి, తెలుగుజాతి ఉన్నతి గురించి అమెరికాలో ఉన్న ఒక బంధువు తెగబాధపడిపోతూ మాట్లాడాడు. తెలుగు జాతికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆయన వాపోయాడు. నాకు చాలా విస్మయం కలిగింది. అంతా ట్రాష్ అనిపించింది. అసలు ఇక్కడ జరుగుతున్నవాటికి ఏమీ సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడనిపించింది. ఉన్న ఊరును, కన్నవారిని, తెలుగుజాతిని, దేశాన్ని వదిలేసి అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నాడు. డాలర్లు పండిస్తున్నాడు. వృద్ధులయిన కన్న తలిదండ్రులను అనాథాశ్రమాల్లో చేర్పించాడు. డాలర్ విలువ పెరిగి, రూపాయి విలువ తగ్గినప్పుడు మహా ఆనందంగా సెలెబ్రేట్ చేసుకున్నట్టు చెప్పాడు. వీళ్లకు తెలుగుజాతి ఏమైతేనేం? భారత దేశం ఏమైతేనేం? దేశం ఆర్థికంగా ఎంత దెబ్బతింటేనేం?’ అని హైదరాబాద్‌లో నివసిస్తున్న ఒక రాయలసీమ మిత్రుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బహుశా నాతో మాట్లాడిన వాళ్లిద్దరిపై ప్రభావం ఉండబోదు కాబట్టి, వాళ్లలా అనుకున్నారనుకుందాం. కానీ ప్రభావం ఉండేవాళ్లెవరు? మొత్తం సుమారు 25 వేల మంది ఉద్యోగులు సీమాంధ్ర సచివాలయానికి, డైరెక్టరేట్‌లకు బదిలీ అవుతారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెబుతోంది. అంటే పదేళ్లలో ఈ 25 వేల మందిలో చాలా మంది పదవీ విరమణ పొందే అవకాశం ఉంది. కొందరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. కొత్తగా రిక్రూట్ అయ్యేవారు ఎక్కడికయినా వెళ్లడానికి సిద్ధపడి వస్తారు. కొత్తరాజధానికి మారాల్సి వచ్చినా అటువంటి వారి సంఖ్య పదివేలకు మించకపోవచ్చు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల నియామకాలు, బదిలీలు ఎలాగూ విభజనతో ప్రభావితం అయ్యే అవకాశం లేదు. బెంగుళూరు ఐటి ఉద్యోగుల్లో 40 శాతం మంది మనవాళ్లే ఉంటారని చెబుతారు. చెన్నయ్, పూనాల్లో కూడా మనవాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో అత్యధిక శాతం మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. రైల్వేల్లో ఒక దశలో అత్యధికులు తమిళులు ఉన్నారు. కానీ ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చింది? విభజన వీరికి ఏవిధంగా ఇబ్బంది కలిగిస్తుంది? అస్తులు, వ్యాపారాల విషయమూ అంతే. బెంగుళూరులో కన్నడిగుల తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అత్యధికశాతం మంది మనవాళ్లే. అక్కడేమయినా ఇబ్బందులు వచ్చాయా? హైదరాబాద్‌లో రావడానికి? ఇదంతా ఒక బూటకపు ప్రచారం. మీడియా సృష్టించిన భూతం.

ఇప్పుడు వివాదాన్నంతా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకరిస్తున్నారు. ‘హైదరాబాద్‌ను మేము అభివృద్ధి చేశాం. ఇప్పుడు వదిలిపొమ్మంటే ఎందుకు పోతాం. దీనిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి’ అని సమైక్యవాదులు డిమాండు చేస్తున్నారు. సొంత రాష్ట్రం, స్వయంపాలనాధికారం, వనరులు, వసతులు, ఉద్యోగాలపై పెత్తనం అన్నీ వదులుకుని హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేయడానికి ఒప్పుకున్నందుకు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మీరిచ్చే బహుమతి ఇదా? ఆరు దశాబ్దాలుగా అన్ని రకాల వివక్షలు అనుభవించినందుకు తెలంగాణకు దక్కే ప్రతిఫలం ఇదా? తెలంగాణ చేసిన త్యాగాలకు సీమాంధ్ర చేస్తున్న ప్రత్యుపకారం ఇదా? హైదరాబాద్ మీరు రాకముందే 190 ఏళ్ల నుంచి దక్కను రాజ్యాలకు రాజధానిగా ఉంది. హైదరాబాద్ ఆనాడే అన్నివసతులు కలిగి ఉంది. అన్ని వసతులతో రెడీ మేడ్ రాజధాని ఉందనే మీరు ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్‌ను మీరు తీసుకురాలేదు. హైదరాబాద్‌కే మీరు వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించినమాట వాస్తవం. కానీ ఆ అభివృద్ధి ఫలాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎక్కడికి పోతాయి? ఎవరు లాక్కోగలరు? విజ్ఞత కలిగినవారు ఆలోచించాలి. ‘తొండలు గుడ్లు పెట్టే నగరాన్ని బాగు చేశాం’ అని ఒక పెత్తందారి అహంకారం. ‘విభజిస్తే హైదరాబాద్ మరో పాలస్తీనా అవుతుంది’ అని తెల్లని పంచెకట్టిన ఒక ఉన్మాది ప్రేలాపన. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చుతుంది ఒక మహాతల్లి మిడిమిడి జ్ఞానంతో! ‘హైదరాబాద్‌కు మేము రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా?’ అని ఒక వితండవాది ప్రశ్న. చెన్నయ్ నుంచి మీరు వచ్చిన తర్వాత అభివృద్ధి ఆగిపోయిందా? జాతీయ స్థాయిలో ఆ నగరం హోదా ఏమైనా తగ్గిందా? అక్కడ తెలుగువారి వ్యాపారాలు సాగడం లేదా? అక్కడ తెలుగువారు ఉద్యోగాలు చేయడం లేదా? అదేమయినా ఉగ్రవాద స్థావరం అయిందా? తెలంగాణలో, హైదరాబాద్‌లో ఏవైనా విధ్వంసాలు జరిగితే అవి మీ కారణంగానే, మీ హయాంలోనే, మీ కుట్రలతోనే, మీ రాజకీయాలతోనే జరిగాయి. తెలుగు ప్రజలు కలిసి ఉండాలని కోరుకునేవారు మాటలేనా ఇవి? తెలంగాణపై కడుపులో ఇంత విద్వేషం, ఇంత చిన్నచూపు పెట్టుకుని ఐక్యంగా ఉండాలని ఎలా కోరుతున్నారు? ఇప్పటికైనా బుద్ధి జీవులు మేల్కొనాలి. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య మంటపెడుతున్న రాజకీయ అవకాశవాదుల్ని గుర్తించాలి. విధ్వంసకర పాత్ర పోషిస్తున్న నేతలను ఎండగట్టాలి. వంచనకు, మోసానికి పాల్పడుతున్న రాజకీయ పక్షాలను నిలదీయాలి. మాటిమాటికి మాట మార్చే పార్టీలు తెలంగాణ ప్రజలనే కాదు, రేపు ఆంధ్రా ప్రజలను కూడా మోసం చేయగలవు. తస్మాత్ జాగ్రత్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *