అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ ప్రారంభం అవ్వగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ, చర్చ ప్రారంభించడం మంచిదని, అందరూ కలిసికట్టుగా తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని, పరస్పరం సమన్వయం చేసుకుంటే బాగుంటుందని సూచించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని సమస్యలతో పాటు విద్యుత్, రైతు ఆత్మహత్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎన్ని రోజులైనా చర్చకు వెనుకాడమని స్పష్టం చేశారు.
బడ్జెట్ అన్నది సమయానుకూలంగా జరగాల్సిన ప్రక్రియ అని, బడ్జెట్ పై చర్చ పూర్తయిన తర్వాత మిగతా విషయాలపై చర్చిద్దామని, ప్రతిపక్షాలకు చర్చపై చిత్తశుద్ధి లేదని సీఎం పేర్కొన్నారు. సభను ప్రతిపక్ష సభ్యులు ఎందుకు అడ్డుకుంటున్నారో, వారి ఉద్దేశాలు ఏమిటో తమకు తెలుసని, విద్యుత్ పై చర్చ చేపడితే వాళ్ళే తప్పుచేసిన వారిగా దొరికిపోతారని తెలిసి సభను అడ్డుకుంటున్నారని అన్నారు. సభ ప్రారంభమైన తొలిరోజే టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేయటమనేది ఇబ్బందని అంటున్నారు.. కానీ తొలి రోజే ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడం మంచిదా అని సీఎం ప్రశ్నించారు.