మంగళవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో రాష్ట్ర ఆర్ధిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మెచ్చే పద్ధతిలో ప్రజా సంక్షేమమే ఎజెండాగా పాలన ఉంటుందని, ప్రజలకు సేవ చేయడానికి 365 రోజులు పనిచేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లపై అధ్యయనం చేస్తున్నామని, రెండు, మూడు రోజుల్లో వివరాలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా మొదటినుండి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిందని, కేసీఆర్ ఉపఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇక్కడి ప్రజలు కేసీఆర్ ను 2లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించారని, నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి వందల కోట్లు వెదజల్లినా ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి వైఎస్ చెంప చెళ్ళుమనిపించారని ఈటెల గుర్తుచేశారు. రుణమాఫీపై ఆంధ్రా మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నదని, రైతుల రుణాలు ఖచ్చితంగా మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజల దాహాన్ని తీర్చేందుకు అప్పట్లో కేసీఆర్ 1050 గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం అమలుకు 350కోట్ల నిధులు కేంద్రం నుండి సాధించుకొస్తే వైఎస్ అడ్డుకున్నారని, సిద్ధిపేట తరహాలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీ బీ వినోద్ మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా తమ జీవితాన్ని రాష్ట్ర అభివృద్ధికే అంకితమిస్తామని, రాజకీయ అవినీతి లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఉద్యమ నేత ఈటెలకు, యువకిశోరం కేటీఆర్ కు మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా జిల్లా అభివృద్ధి దిశగా ముందుకుపోతుందని అన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు.