mt_logo

ప్రజలే కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: ఆదిలాబాద్‌లో కేటీఆర్

ఆదిలాబాద్‌లో జరిగిన రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడే పనులు అక్కడ ఆగిపోయినయ్. ఆదిలాబాద్‌కు వచ్చేటప్పుడు డిచ్‌పల్లి దగ్గర పోలీసుల భార్యలు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల కుటుంబాలను పోలీసులే గుంజుకుపోయే పరిస్థితి ఉంది అని దుయ్యబట్టారు.

ఇక్కడికు వస్తుంటే ఉట్నూరులో పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని జోగు రామన్న చెప్పారు. ప్రజల కోసం, రైతుల కోసం జైలుకు పోతా.. ఎవ్వని అయ్యకు భయపడేది లేదు. కానీ ప్రజలే మర్లవడి, కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని విమర్శించారు.

ఆడబిడ్డలకు రూ. 2,500 ఇస్తా అని అన్నాడు. మరి మహిళలు లైన్ కట్టి పోలీస్ కేసు పెడితే.. రైతులు రైతు భరోసా ఇవ్వలేదని లైన్ కట్టి రైతులు పోలీస్ కేసు పెడితే.. నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాల కోసం కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా? అని ప్రశ్నించారు.

మేము పదేళ్లు ఉన్నాం.. ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు న్యాయంగా, ధర్మంగా నడుచుకోవాలె. ఎవరైనా ఎక్కువ చేస్తే పేర్లు రాసి పెట్టుకోండి మిత్తితో ఇస్తాం. పెద్ద పెద్దోళ్లను చూసినం.. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుతోనే కొట్లాడినం. ఈ చిట్టి నాయుడు ఎంత? వీడిని చూసి మనం భయపడాల్నా? అని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ అధికారుల విషయంలో మళ్లీ చెబుతున్నా? చట్టం ప్రకారం నడుచుకోండి. లేదంటే మేము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తాం. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో 2 వేల ఇళ్లు కూలగొట్టేందుకు వెళ్లారు. ఇళ్లు కూలగొడతా అంటే ఒక పెద్దమనిషి ఒక మాట అన్నందుకు ఒకాయనను జైల్లో పెడతారంటా..100 రోజుల్లో అన్ని చేస్తా అన్నా లుచ్చా గాళ్లను జైల్లో పెట్టాల్నా, పేద ప్రజలను జైల్లో పెట్టాల్నా? గరీబులు, రైతులు, విద్యార్థులు, నా మీద కేసులు పెడతా అంటే ఊరుకునే వాళ్లు ఎవరు లేరు అని కేటీఆర్ హెచ్చరించారు.

మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి.. మీ పక్కనే ఉన్న మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్ మోసాలను చెప్పండి. మొత్తం అడ్డగోలు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ఎట్ల మోసం చేశారో వాళ్లకు చెప్పండి. కాంగ్రెస్ లుచ్చా గాళ్లకు ఓట్లేస్తే మళ్లీ మోసం జరుగుతుదని మహారాష్ట్ర వాళ్లకు చెప్పాలె అని పిలుపునిచ్చారు.

ఉద్యమంలో ఆదిలాబాద్ ముందు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఇక్కడి నుంచే అగ్గి అంటుకున్నది. ఇక్కడి ముకురా రైతులు కాంగ్రెస్ లుచ్చాలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డులు రాసి.. పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేశారు. కొమురం భీమ్ పుట్టిన గడ్డలో ఇలాంటి ఉద్యమాలు ఇంకా వస్తాయి అని పేర్కొన్నారు.

ఇక్కడ రైతులు రుణమాఫీ కాలేదని దిష్టిబొమ్మలు కాలబెడితే వాళ్లను జైల్లో పెడతారంట. రైతులు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మాకు మీరు శక్తిని ఇవ్వండి మీకోసం మేము జైలుకు వెళ్తాం అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కంటే బీజేపీ వాళ్లు మరీ ప్రమాదకరం. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ బీజేపీ వ్యక్తే.. గుజరాత్‌లో పత్తి క్వింటాలుకు రూ. 8,800 అంట.. అక్కడి కన్నా మనకు తక్కువ ఇస్తారంట. గుజరాత్‌కు ఒక నీతి, మనకు ఒక నీతా? అని అడిగారు.

గుజరాత్‌లో కంటే తెలంగాణ పత్తి క్వాలిటీ అని పరిశ్రమ వర్గాల  వాళ్లే నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. గుజరాత్‌లో ఇచ్చినట్లే పత్తికి రూ. 8800 ఇవ్వాలె. లేదంటే కాంగ్రెస్‌పై ఎట్ల కొట్లాడుతామో బీజేపీపై అట్లనే కొట్లాడుతాం..సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. మరీ ఇప్పటి వరకు స్టార్ అయ్యిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

మోడీ రూ. 15 లక్షలు రాలేదు.. రేవంత్ రెడ్డి రూ. 15 వేలు రాలేదు. అక్కడ జుమ్లా పీఎం ఉన్నాడు. ఇక్కడ హౌలా సీఎం ఉన్నాడు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్ అన్నాడు. మైనార్టీ, యువజన, మహిళా డిక్లరేషన్ అన్నాడు. ఎవ్వరినీ వదలకుండా మోసం చేశారు అని మండిపడ్డారు.

ఇంకా మూడేళ్లు కొట్లాడేది ఉంది. ఆదిలాబాద్ ప్రజలు మాకు పోరాటం తొవ్వ చూపారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వచ్చే వరకు మనం పోరాటం చేయాల్సిందే. బోనస్ బోగస్ అయ్యింది, పత్తి రైతు చిత్తు అయ్యిండు, రైతు భరోసా దిక్కు లేదు. రైతుల కల్లాల వద్దకు మనమే పోదాం. కొనుగోలు కేంద్రాల వద్దనే నిలదీద్దాం అని తెలిపారు.

బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి.. రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. మరికొన్ని రోజులు అయితే వీళ్ల ఏడాది మాసికం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేదాకా మనం పోరాటం చేస్తూనే ఉందాం అని అన్నారు.

కేసీఆర్ గారు ఉన్నప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేయలేదు. మనిషిని మనిషిగా చూస్తూ అందరికీ ప్రయోజనం చేశారు. హిందూ మహిళలకు బతుకమ్మ చీరలు ఇస్తే, ముస్లింలకు, క్రైస్తవులకు రంజాన్, క్రిస్మస్ తోఫా ఇచ్చారు. మతాన్ని చూడకుండా అందరూ బాగుపడాలనే ప్రయత్నం చేశారు. మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై లక్షా రూపాయలకు పైగా ఖర్చు చేశారు అని గుర్తు చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మకండి. తండ్రి సమానుడైన కేసీఆర్ గారు అందరి కోసం పనిచేస్తారు. నల్గొండ జిల్లా రామన్నపేట వద్ద అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తే అక్కడి ప్రజలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై కూడా అదానీ కన్ను పడింది. ఇక్కడ కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. బెల్లంపల్లి, ఆదిలాబాద్, సింగరేణిపై కూడా అదానీ కన్ను ఉంది. దాన్ని గుత్తకు పెట్టారు. అందుకే మనం గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం మోడీ మేరా బడే భాయ్ అంటాడు.. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ అంటే… రేవంత్ రెడ్డి మాత్రం అదానీ మేరా దోస్త్ అంటాడు. పైన తిడుతారు.. కింద మాత్రం దోస్త్ చేస్తారు. కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు అని విమర్శించారు.

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేసి నేను అదానీని తిడుతుంటే నువ్వెందుకు దోస్త్ చేస్తున్నావని అని అడగవచ్చు కదా? ఈ దొంగల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే ఉన్నది ఒక్క కేసీఆర్ మాత్రమే.. తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి బాటలో నడుద్దాం అని కేటీఆర్ సూచించారు.