ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా వికలాంగులకు రూ. 1500, వృద్ధులు, వితంతువులకు రూ. 1000 పించన్ ను ఈ సంవత్సరం నుండే అమలు చేసి తీరుతామని ఆర్ధిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. బుధవారం కరీంనగర్ జిల్లాలో టీజేఏసీ ఆధ్వర్యంలో మంత్రి ఈటెలకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, గురుకుల్ ట్రస్ట్ భూముల్లో 627 ఎకరాలను ఆక్రమించుకుని అక్రమంగా కట్టడాలు చేపట్టారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు.
2004లోనే దళితులకు మూడెకరాల భూమి ప్రతిపాదనను టీఆర్ఎస్ రూపొందించిందని, పరిపాలనా సామర్ధ్యం మీకు లేదని పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారని, సామాన్యుడు తలచుకుంటే ఎంతటి సాహసం చేస్తాడో ముందుముందు చూస్తారని అన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గురుకుల్ ట్రస్ట్ భూముల్లో రెండెకరాల్లో ఇల్లు కట్టుకున్నాడని, ఇదేమిటని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండని ఎగతాళి చేశారని, అలాంటి అక్రమాలన్నిటిపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు.