mt_logo

తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ, యూట్యూబ్ ఛానళ్ళకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

కేవలం తనను, తన కుటుంబాన్ని బద్నాం చేయాలనే కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్ళతో పాటు యూట్యూబ్ మరియు సోషల్ మీడియా సంస్థలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు లీగల్ నోటీసులు పంపించారు.

కేవలం తనకు, తమ కుటుంబానికి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఈ ఛానళ్ళు, మీడియా సంస్థలు, పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఒక పక్కా ఎజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నాయన్నారు. అసలు తమకు సంబంధమే లేని అనేక అంశాల్లో తమ పేరును, తమ ఫోటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన తంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్న ఈ ఛానళ్లపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కేవలం ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయాలన్న కుట్రలో భాగమైన వీరందరు చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కొనక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా తమకు, తమ కుటుంబానికి సంబంధంలేని అంశాలలో దుర్మార్గపూరిత ప్రచారం చేస్తూ, పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు.

ఇలాంటి అసత్యపూరిత అంశాలను వెంటనే తొలగించుకుంటే మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి వాటికి లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ తెలిపారు.

అయితే కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకొని, ఇలాంటి వీడియోలను, కంటెంట్‌ను తీసివేసినామని చెబుతూ స్పందించినట్లు కేటీఆర్ తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి కంటెంట్‌ను తీసివేయకుంటే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇకపైన తమకు, తమ పార్టీకి సంబంధం లేని అంశాలపైన అడ్డగోలు ప్రచారం, అసత్య ప్రచారం చేసే ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్స్‌పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని గుర్తించాలని కేటీఆర్ తెలిపారు. కేవలం ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్‌కి సైతం లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ తెలిపారు.

ఇకపైన ఆయా మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ కేవలం వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే అసత్యాలను, అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకుంటే మంచిదని కేటీఆర్ సూచించారు. తమ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ మరిన్ని లీగల్ నోటీసులకు, కేసులకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారు.