mt_logo

వాళ్లేమైనా దొంగలా, ఉగ్రవాదులా.. రైతు నాయకుల అరెస్టుపై కేటీఆర్ ధ్వజం

రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు ఛలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన పాపానికి రాష్ట్రవ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య.. వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు.

ఇవ్వాళ ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలి అని అన్నారు..

పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రికి రైతులంటే ఇంత భయమెందుకు.. అన్నదాతలపై ఇంతటి నిర్బంధమెందుకు.. అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన పథం పట్టారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదు అని వ్యాఖ్యానించారు.