mt_logo

రేవంత్ బంధువులకు అర్హత లేకున్నా అమృత్ టెండర్లు కట్టబెట్టారు: కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతున్న విషయంలో జోక్యం చేసుకుని నిజాలను నిగ్గు తేల్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, టోచన్ సాహూలకు కేటీఆర్ లేఖ రాశారు.

ఇప్పటికే అమృత్ టెండర్లపైన మా పార్టీతో సహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అనేకసార్లు ఈ అవకతవకలపైన స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క మాట కూడా సమాధానంగా రాలేదని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ. 1500 కోట్ల రూపాయల టెండర్లు ముఖ్యమంత్రి సొంత బావమరిది కంపెనీకి అర్హతలు లేకున్నా కట్టబెట్టారన్న ఆరోపణలపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కేటీఆర్ కోరారు. 

ఈ టెండర్ల తాలూకు సమాచారాన్ని బయటకు పొక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకొన్నదన్న విషయాన్ని కేంద్రమంత్రికి దృష్టికి కేటీఆర్ తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈ అంశంలో సమాచారం ఇవ్వడం లేదన్నారు. 

ముఖ్యమంత్రి బావమరిది ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నారని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించిన విషయం అయినందున వెంటనే అమృత్ పథకంలో గత తొమ్మిది నెలలుగా జరిగిన ప్రతి టెండర్‌ని సమీక్షించి, నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఈ టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు.

ఎలాంటి అనుభవం లేకున్నా కేవలం ముఖ్యమంత్రి బంధువు అన్న ఏకైక అర్హతతో ఈ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం అయా కంపెనీలకు కట్టబెట్టిందని కేటీఆర్ ఆరోపణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అటు టెండర్ల విషయాన్ని కానీ, టెండర్లు దక్కించుకున్న కంపెనీల తాలూకు విషయాన్ని కానీ బయటకి పొక్కకుండా మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్లతో పాటు ఇతర ఈ టెండరింగ్ వెబ్ సైట్లలోనూ సమాచారం ఉంచకుండా మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసిన మేఘ కంపెనీకి కూడా టెండర్లు అప్పజెప్పినట్లు దాదాపు 40 శాతంకు పైగా అంచనాలు పెంచి మరీ పనులను అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయని కేటీఆర్ తన లేఖలో కేంద్ర మంత్రికి తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్ల తాలూకు సమాచారాన్ని పూర్తిగా దాచి ఉంచుతున్న నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని టెండర్ల తాలూకు డాక్యుమెంట్లని వెంటనే బహిర్గతం చేయాలని, ఈ టెండర్లు దక్కించుకున్న కంపెనీల తాలూకు వివరాలను కూడా ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని తన లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా జరిగిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ చేశారు. అమృత్ పథకం నిధులలో జరుగుతున్న అవినీతిపైన కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని కేటీఆర్ కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి చెందిన శోధ కంపెనీ ఇతర కంపెనీలతో కలిసి రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఎలాంటి అర్హతలు లేకున్నా దక్కించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్టు పనులను సృజన్ రెడ్డి కంపెనీతోపాటు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేసిన మేఘా కంపెనీ, కేఎన్ఆర్ కంపెనీలకు కాంట్రాక్టులు అప్పజెప్పినట్టు కేటీఆర్ తన లేఖలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కేఎన్ఆర్ కంపెనీలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి వాటాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని  ఇవ్వాలని కేటీఆర్ కోరారు.

మొత్తం తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో పురపాలక శాఖ పరిధిలో జరిగిన అన్ని టెండర్లలోను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనసాగే కార్యక్రమాల తాలూకు టెండర్ల విషయంలో నిజాలను నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచాలని కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులను కేటీఆర్ కోరారు.

రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి తో పాటు మీ సొంత పార్టీ బిజెపికి చెందిన నేతలు సైతం చేస్తున్న ఆరోపణలపైన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న అవినీతి కార్యక్రమాలలో కేంద్రానికి కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్ముతారని కేటీఆర్ హెచ్చరించారు.